హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు మరో జాతీయ స్థాయి అవార్డు లభించింది. రైతు ఉత్పత్తి సంస్థల (ఎఫ్పీవో) ఏర్పాటులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)కు జాతీయ స్థాయి ఉత్తమ అవార్డును ప్రకటించింది. బుధవారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నుంచి సీవోవో ఎన్ రజిత ఈ అవార్డును అందుకొన్నారు. ఈ సందర్భంగా జాతీయ గ్రామీణ జీవనోపాదుల మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం) అదనపు కార్యదర్శి చరణ్జిత్సింగ్.. తెలంగాణ సెర్ప్ సీఈవో) సందీప్కుమార్ సుల్తానియాను అభినందించారు.
ఆత్మనిర్భర్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన 10కే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్పీవో) పథకంలో తెలంగాణ సెర్ప్ ఆధ్వర్యంలో 35 రైతు ఉత్పత్తిదారుల సమాఖ్యలను కంపెనీల చట్టం ప్రకారం రిజిస్టర్ చేశారు. ఇందులో సభ్యులుగా ఉన్న 23,469 మంది మహిళా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను దళారుల ప్రమేయం లేకుండా నేరుగా కంపెనీలకు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంటల అమ్మకాల్లో దళారుల ప్రమేయాన్ని నివారించేందుకు ఎఫ్పీవోల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నది. సెర్ప్ ద్వారా సన్న, చిన్నకారు రైతులకు తక్కువ ధరకు వ్యవసాయ పరికరాలు, యంత్రాలను అందుబాటులో ఉంచింది.