సిద్దిపేట, ఫిబ్రవరి 9: ప్రముఖ అష్టావధాని, వాస్తు, జ్యోతిష పండితుడు, భూగర్భ జల నిపుణుడు, అనంతసాగర్ సరస్వతీ దేవాలయ నిర్మాణకర్త సిద్దిపేట పట్టణానికి చెందిన అష్టకాల నరసింహరామశర్మ (80) బుధవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. నరసింహరామశర్మ మృతిపట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. అష్టావధాని కుటుంబీకులకు సానుభూతి తెలిపారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన నరసింహ రామశర్మ అవధాన ప్రక్రియలో నిష్ణాతుడిగా పేరుపొందారు. 1943 అక్టోబర్ 2న దుర్గాష్టమి రోజున లక్ష్మయ్య-మనోహరమ్మ దంపతులకు రామశర్మ జన్మించారు.
ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఎంఏ తెలుగు చదివిన నరసింహరామశర్మ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తన పదిహేనో యేట బాసర సరస్వతీ క్షేత్రాన్ని దర్శించి, అక్కడే 46 రోజులపాటు ధ్యానం చేసి అమ్మవారి కటాక్షం పొందారు. అమ్మవారి ఆజ్ఞ మేరకు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్లో సరస్వతీ దేవాలయ నిర్మాణానికి 1980లో శంకుస్థాపన చేశారు. అమ్మవారి ఆదేశానుసారం తన అవధాన ప్రక్రియ వల్ల వచ్చిన డబ్బులతో దేవాలయాన్ని నిర్మించారు. 1990 జనవరి 31న మాఘశుద్ధ పంచమి రోజు దేవాలయాన్ని ప్రతిష్ఠించారు. దాదాపు 500కు పైగా సరస్వతీ యజ్ఞాలు నిర్వహించారు. ఉపాధ్యాయ ఉద్యోగంతో పాటు అష్టావధానిగా, జ్యోతిష శాస్త్ర పండితుడిగా, కవిగా పేరుపొందారు. తెలుగు, సంస్కృతంలో ఆయన రాసిన రచనలు ప్రాచుర్యం పొందాయి.
2010లో స్వర్ణకంకణంతో సత్కారం
సాహిత్య రంగంలో అష్టకాల నరసింహరామశర్మ చేసిన సేవలకు 2014లో తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారంతో సన్మానించింది. 2003లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందజేసింది. 2010లో కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతిస్వామి స్వర్ణ కంకణంతో సత్కరించారు. కనకాభిషేకం, తులాభార సన్మానాలు పొందారు. వీణాపాణి త్రైమాసిక పత్రిక నిర్వహించారు. అవధాన శిరోమణిగా, అవధాన జ్ఞానభారతిగా, సారస్వత శిరోమణిగా, కవితా సుధాకర, కవికోవిద, బ్రాహ్మీవిభూషణ, అవధాన కళాప్రపూర్ణగా బిరుదులు పొందారు. దాదాపు 40 ఏండ్లు పచ్చి పాలు, పండ్లను మాత్రమే తీసుకొంటూ నిరాహారయోగిగా నిరాడంబర ఆధ్యాత్మిక జీవనం గడిపారు.
రామశర్మ జీవితం భావితరాలకు మార్గదర్శనం: హరీశ్రావు
ప్రముఖ పండితులు అష్టకాల నరసింహరామశర్మ మృతి అవధానానికి, ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. నరసింహరామశర్మ మృతిపై హరీశ్రావు దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్కు, తనకు.. నరసింహరామశర్మ అత్యంత ఆత్మీయుడని గుర్తుచేసుకొన్నారు. సిద్దిపేట, తెలంగాణకు వన్నె తెచ్చిన గురువు అష్టకాల నరసింహశర్మ అని పేర్కొన్నారు.
అవధాన ప్రక్రియ వల్ల వచ్చిన డబ్బులతో అనంతసాగర్లో సరస్వతీ అమ్మవారి దేవాలయాన్ని నిర్మించి సామాజిక సేవకుడిగా సమాజానికి స్ఫూర్తినిచ్చారని కొనియాడారు. ఎంతో మందిని అవధానులుగా తీర్చిదిద్ది అవధాన శిరోమణిగా పేరుగాంచారని పేర్కొన్నారు. హైదరాబాద్లో జరిగిన తెలుగు ప్రపంచ మహాసభల్లో నరసింహరామశర్మ అవధానం ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారని గుర్తుచేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 500కు పైగా సరస్వతీ యజ్ఞ యాగాదులు నిర్వహించి అమ్మవారి మహత్యాన్ని చాటి చెప్పారని తెలిపారు. ఆయన జీవితం భావితరాలకు మార్గదర్శనం కావాలని ఆకాంక్షించారు. నరసింహరామశర్మ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నరసింహరామశర్మ మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం
ప్రముఖ సాహితీవేత్త, ఆధ్యాత్మిక వేత్త, అష్టావధాని.. అష్టకాల నరసింహరామశర్మ మృతిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంతాపం ప్రకటించారు. ఆధ్యాత్మిక, సాహితీవేత్తగా ఆయా రంగాలకు రామశర్మ చేసిన సేవలు చిరస్మరణీయమని సీఎం కొనియాడారు. అష్టకాల ఆధ్యాత్మిక సాహిత్య కృషి.. సిద్దిపేట ప్రాంత కీర్తి ప్రతిష్ఠలను మరింతగా ఇనుమడింపచేశాయని వివరించారు. నరసింహరామశర్మతో తనకున్న అనుబంధాన్ని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. నరసింహరామశర్మ కుటుంబీకులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.