హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో సెమిస్టర్ పద్ధతిని ప్రవేశపెడుతున్నట్టు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కుసుంబ సీతారామారావు చెప్పారు. ఇప్పటివరకు వార్షిక పద్ధతిలో పీజీ కోర్సులను నిర్వహిస్తుండగా.. 2022-23 విద్యాసంవత్సరం నుంచి రెండేండ్ల పీజీ కోర్సును నాలుగు సెమిస్టర్లుగా విభజించి బోధించనున్నామని తెలిపారు. డిగ్రీలో అమలవుతున్న చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్)ను పీజీ కోర్సులకు సైతం వర్తింపజేస్తామని చెప్పారు. తెలుగు మీడియంలో మాత్రమే ఉన్న పీజీ కోర్సులను ఇకనుంచి ఇంగ్లిష్ మీడియంలోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. న్యాక్ గుర్తింపే లక్ష్యంగా వర్సిటీలో అనేక నూతన సంస్కరణలు తీసుకొస్తున్నట్టు చెప్పారు. యూనివర్సిటీకి రెండోసారి వీసీగా నియమితులైన ఆయన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో అమలుచేస్తున్న సంస్కరణలను వివరించారు.
రెండువిడతల్లో అడ్మిషన్లు..
యూజీసీ మార్గదర్శకాల ప్రకారం ఈ ఏడాది నుంచి రెండువిడతల్లో అడ్మిషన్లు కల్పిస్తున్నాం. జూలైలో ఒకసారి, డిసెంబర్/ జనవరిలో రెండోసారి ప్రవేశాలు కల్పిస్తున్నాం. కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతులు నిర్వహించలేని పరిస్థితిలో విద్యార్థుల సౌకర్యార్థం ఆన్లైన్ క్లాసులు, యూట్యూబ్ చానల్ను తీసుకొచ్చాం. ఆడియో, వీడియో పాఠాలను కొనసాగిస్తున్నాం. ప్రత్యక్ష తరగతులకు గతంలో 20-30 మంది వస్తే.. ఆన్లైన్ క్లాసుల్లో 60-70 శాతం మంది హాజరవుతున్నారు. ఒకే సమయంలో 36 సబ్జెక్టులు బోధించేలా ఆన్లైన్ షెడ్యూల్ రూపొందించాం. విద్యార్థులు నష్టపోకుండా సకాలంలో పరీక్షలను నిర్వహించి, ఫలితాలు ప్రకటించే ఏర్పాట్లు చేస్తున్నాం.
పుస్తకాలు పీడీఎఫ్ రూపంలో..
విద్యార్థులు ఇంట్లో ఉండి చదువుకునేందుకు అనువుగా పుస్తకాలను పీడీఎఫ్రూపంలోకి మార్చాం. ఆయా పీడీఎఫ్లను కోర్సులవారీగా విద్యార్థుల మెయిల్స్కు పంపించాం. విద్యార్థులు వాటిని డౌన్లోడ్ చేసుకొని చదువుకునే ఏర్పాట్లు చేశాం. వర్సిటీలో కొత్తగా నైపుణ్యశిక్షణ కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. కొత్తగా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కోర్సును ఈ ఏడాది నుంచే ప్రవేశపెట్టబోతున్నాం. ఇందుకు కరిక్యులం రూపకల్పనతోపాటు కోర్సు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. దేశంలో రెండే సార్వత్రిక విశ్వవిద్యాలయాలు న్యాక్ గుర్తింపు పొందాయి. ఒకటి ఇగ్నో కాగా, రెండోది నేతాజీ సుభాష్ ఓపెన్ యూనివర్సిటీ. బీఆర్ఏవోయూ సైతం న్యాక్ గుర్తింపు పొందేలా ప్రయత్నాలు చేస్తున్నాం. న్యాక్ గుర్తింపుకు సంబంధించి సార్వత్రిక విశ్వవిద్యాలయాలకు ఇటీవలే యూజీసీ మార్గదర్శకాలు విడుదల చేసింది. 140 పాయింట్లను ఖరారుచేసింది. ఆయా పాయింట్ల ప్రకారం వర్సిటీలో సంస్కరణలను వేగంగా చేపడుతున్నాం.