హనుమకొండ సబర్బన్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): కథలు కనుమరుగైపోతున్న తరుణంలో నమస్తే తెలంగాణ, ముల్కనూర్ ప్రజా గ్రంథాలయం కలిసి కథారచనలకు ప్రాణం పోస్తున్న తీరు అభినందనీయమని వక్తలు కొనియాడారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మంచి సాహిత్య కార్యక్రమాలను నిర్వహించడం గొప్ప విషయమని ప్రశంసించారు. నమస్తే తెలంగాణ, ముల్కనూర్ ప్రజాగ్రంథాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి కథల పోటీలు-2021 బహుమతుల ప్రదాన కార్యక్రమం ఆదివారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్లో వైభవంగా నిర్వహించారు. విశిష్ట అతిథులు ఆయా కథలకు బహుమతులు అందించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంగనభట్ల మాట్లాడుతూ.. నమస్తే తెలంగాణ పత్రిక వల్ల అనేక మంది రచయితలు వెలుగులోకి వస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మరుగున పడుతున్న సాహితీ కార్యక్రమాలకు ములుకనూరు ప్రజాగ్రంథాలయం, నమస్తే తెలంగాణ కృషి వెలకట్టలేనిదని అభిప్రాయపడ్డారు. ప్రతి రచయిత రాసే అక్షరాలు వృథా పోవని.. సమాజానికి ఉపయోగపడుతాయని తెలిపారు. పుస్తకాలు లేని ఇల్లు అంధకారం లాంటిదని పేర్కొన్నారు. మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ.. ఒకప్పుడు ప్రతి కాలేజీలో సాహితీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించేవారని, ఇప్పుడు అలాంటి సంస్కృతి లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.
నమస్తే తెలంగాణ పత్రిక, ముల్కనూర్ గ్రంథాలయం కలిసి ఇంత పెద్ద ఎత్తున కథల పోటీ నిర్వహించి బహుమతులు అందించడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే సతీశ్కుమార్ మాట్లాడుతూ.. ముల్కనూర్ గ్రంథాలయంలో 20 వేల పుస్తకాలను నిరుద్యోగుల కోసం అందుబాటులో ఉంచడం మంచి పరిణామమని అన్నారు. మొదటి నుంచి తెలంగాణ సాహిత్యం వెలికితీత కోసం నమస్తే తెలంగాణ చేసిన కృషి మరువలేనిదని తెలిపారు. నమస్తే తెలంగాణ చీఫ్ ఆఫ్ బ్యూరో ఓరుగంటి సతీశ్ మాట్లాడుతూ సాహితీకారులను ప్రోత్సహించే విషయంలో ముల్కనూర్ ప్రజా గ్రంథాలయానికి నమస్తే తెలంగాణ ప్రోత్సాహం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని హామీ ఇచ్చారు. అదేవిధంగా రచయితలు వారి కథలను ప్రచురిస్తూ ఉత్సాహాన్ని నింపుతున్నామని వెల్లడించారు.
కార్యక్రమానికి స్థానిక జడ్పీటీసీ వంగ రవీందర్గౌడ్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో నమస్తే తెలంగాణ ఫీచర్స్ ఎడిటర్ కరణం జనార్దన్రావు, ప్రముఖ సాహిత్య విమర్శకుడు సంగనభట్ల నర్సయ్య, హనుమకొండ జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్కుమార్, రిజిస్ర్టేషన్లు, స్టాంపుల శాఖ ఐజీ వేముల శ్రీనివాసులు, ఎంపీపీ జక్కుల అనిత, సర్పంచ్ మాడ్గుల కొమురయ్య, ఎంపీటీసీ అప్పని పద్మ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్ర శ్రీహరి పాల్గొన్నారు. 10 మందికి ప్రత్యేక బహుమతులు, ఆరుగురికి రూ.5 వేల చొప్పున నగదు బహుమతి, మరో 10 మందికి రూ.2 వేల చొప్పున బహుమతి, 28 మందికి రూ.1000 చొప్పున నగదు బహుమతిని అతిథులు అందజేశారు. రామాచంద్రమౌళి రాసిన కొలిమి, ఐతా చంద్రయ్య రాసిన సాధనాశూరత్వం, అయోధ్యరెడ్డి రాసిన సీతంబాయి పొలం, గుమ్మడి రవీంద్రనాథ్ రాసిన ఆకాశం కథలకు విశిష్ట బహుమతుల కింద సెల్ఫోన్లు అందజేశారు.