CM KCR | అతనొక చెంచు పెద్ద. అనేక యుద్ధాలలో ఆరితేరినట్టు ఉన్నాడు. నల్లమల అడవిలోని ఊడలమర్రిని తలపిస్తున్నాడు. ఇప్పటివాడా? చాలా ఎన్నికలు చూశాడు. అనేకమంది పాలకులను గమనించాడు. పేదల కోసం ఎవరూ ఏమీ చేయలేదనే నిశ్చితాభిప్రాయానికి వచ్చాడు.కానీ, తెలంగాణ సర్కారు సంక్షేమ పథకాలు ఆయన అభిప్రాయాల్ని మార్చేశాయి. ఇన్నిన్ని పథకాలు ఇంటికే వస్తాయని ఊహించలేదు. తమఊరికి దారి, తమ ఇంటికి నల్లా, తమ భూమికి రైతుబంధు.. అన్నీ కలలా అనిపిస్తున్నాయి. ఈ నిజాల గురించి మనసు విప్పి మాట్లాడాడు.
అక్కడే ఓ పక్కన భుజాన తువ్వాల కప్పుకొని తన ఇంటి ఆవరణలో పూల మొక్కలకు నీళ్లుపోస్తున్న ఓ చెంచు పెద్ద మనిషిని నమస్తే తెలంగాణ కదిలించింది. “ఏం బాబాయ్? అంత బాగేనా..? ఎండలు సంపుతున్నయి కదా” అంటూ మాటలు కలిపింది. ‘గీ ఎండలకే గిట్ల మాట్లాడితే ఎట్లా? ఒకప్పుడు కాలినడకన కిలోమీటర్లకు కిలోమీటర్లు నడిచేటోళ్లం. గీ రోడ్డు గిప్పుడు బాగుంది. మా అప్పుడు అస్సలు నడవడానికి కూడా సదుపాయం లేకపోయేది. కాళ్లకు ఏవేవో పుల్లలు, ముండ్లు గుచ్చుకొని, రాళ్లూ రప్పలు తగిలి రక్తం కారేది. భుజాన సంచులు మోసుకుంటూ.. సంకన పిల్లాడిని ఎత్తుకొని వచ్చిపోయేటోళ్లం. ఇక వానకాలంలో అయితే రాళ్ల వాన మమ్మల్ని బండరాళ్లతో కొట్టినట్టుగా పడేది’ అంటూ గతంలోని చేదు అనుభవాలు పంచుకున్నాడు ఆ వ్యక్తి. ‘గిప్పుడు ఏంది పరిస్థితి.. గట్లనే నడవాల్సిందేనా మీరు?’ అంటూ చర్చకొనసాగించాం.
‘గా కష్టం గిప్పుడు లేదు. కేసీఆర్ సార్ సీఎం అయినంక మా చెంచు భూములకు పట్టాలిచ్చిండు. రైతుబంధు ఇచ్చిండు. రెండెకరాలు నా కొడుకు పేరు మీద, మూడెకరాలు నా పేరు మీద ఉంది. మొత్తం ఏడాదికి రూ.50 వేలు వస్తున్నయి. కలలో కూడా గిసోంటి పథకం వస్తదని..మేం ఎవ్వరం అనుకోలేదు’ అంటూ పూలతోటలో నిలబడి నవ్వుతూ చెప్పాడు. “ఎండనబడి వచ్చిర్రు… ఇంట్లకు రండి.” అంటూ మమ్మల్ని ఆహ్వానించాడు. లోపలికి వెళ్లి ఓ అరుగు మీద కూర్చున్నాం. చెంబులో నీళ్లిచ్చారు. గొంతు తడుపుకొన్నాం. ఆ తర్వాత తెలంగాణ వచ్చినంక మీ జీవితాలు ఎట్టున్నాయి? అభివృద్ధి ఏమైన జరిగిందా? అని అడిగాం. “ఎందుకు జరగలేదు. గుక్కెడు నీళ్ల కోసం మేం మైళ్ల దూరం కాలినడకన వెళ్లేవాళ్లం. స్నానానికి కూడా నీళ్లు దొరికేవి కాదు.
మా పిల్లలకు చదువు దొరకుతుందనుకోలే. పింఛన్లు వస్తున్నవి. ఒక్కటా రెండా తెలంగాణ ప్రభుత్వం సోలార్ పెట్టి నల్లా కనెక్షన్ల ద్వారా నీళ్లు ఇస్తున్నది.. ఇంటింటికి కరెంట్ పెట్టుకున్నాం. ఆడబిడ్డలకు పెండ్లి చేస్తే కల్యాణలక్ష్మి వస్తున్నది. అడవి మాకు తల్లి అనుకుంటాం. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే బాధ్యతను తీసుకుని మా అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నడు.’ అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. తాను గతంలో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పడానికి ప్రయత్నిస్తుంటే అతడి నోరు తడబడింది. ఆనాటి పరిస్థితులు అతణ్ని కంటతడి పెట్టించాయి. నిజమే, ఎన్నేండ్ల కష్టం, ఎంతెంత నష్టం! ఇదే సమయంలో పక్కనే కూర్చున్న అతని కొడుకు గంగయ్య (36) తన తండ్రి గురించి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు.
“నాయినా! నీ కన్నీటి వ్యధంతా నాకు తెలుసు. మా అవ్వతో నీ పెళ్లి ముచ్చట్లు, నేను పుట్టడానికి పురిటి నొప్పులు భరించలేని పరిస్థితుల్లో అవ్వ పానం కాపాడ్నీకి నువ్వు చేసిన సాహసం. మమ్మల్ని సాకనీకి పొద్దుగాల బోయి.. రాత్రి వరకు దట్టమైన అడవిలో నడిచి.. నన్నారి గడ్డలు, మామిడి చెక్కలు, మారెడు బెడ్డలు, తేనెలు సేకరించేందుకు నువ్వు తిరిగిన రోజులు.. నీ ఆకలిని మాకు తెలియనియ్యకుండా, మా ఆకలి మా ప్రాణాలు తీయకుండా నువ్వు పడిన తపన నాకు యాదికుంది. విసిరేయబడ్డ మన జీవితాలను పట్టించుకునే దిక్కులేని ఘడియలు ఇంకా గుర్తుకున్నయి. అన్నలకు అన్నం పెడుతున్నావనే అనుమానంతో చితకబాదిన ఘటనలు నాకు తెలుసు. ఒక్కపూట బువ్వ కోసం పరితపించే మనబోటివాళ్లు నక్సలైట్లకు ఏన్నుంచి అన్నం పెడుతామనుకున్నారో పోలీసోళ్లు మరి. వాల్ల లాఠీ దెబ్బలకు నీ పాదం వర్రెవాచిన గుర్తులింకా యాదికున్నయి. అమ్మకు అనారోగ్యమొస్తే నేను కాలినడకన వెళ్లి ఎలాగోలాగ రాళ్లు రప్పలు దాటిస్తూ ఇంటికి జీపు తీసుకొచ్చే సరికి అవ్వ చచ్చి పోయింది.
ఆ సంఘటన నాకైతే ఎప్పటికీ నిద్దుర పట్టనియ్యదు. ఇదే కదా నాయనా మన వారసత్వపు కథ. ఇది మన కుటుంబానిదే కాదు. చెంచుల దుస్థితి” అంటూ చెంచు పెంటకు చెందిన గంగయ్య గద్గద స్వరంతో ఆ నాటి కన్నీటి కథను వినిపించాడు. తన తండ్రి దినమొక గండంగా కలో గంజో పోసి కుటుంబాన్ని సాకిన కథంతా చెప్పాడు. ఇప్పుడు తన తండ్రి పుట్టిన నేలలో తానున్నాడు. కానీ ఉమ్మడి పాలన నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని గర్వంగా చెబుతున్నాడు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ మా చెంచుల అభివృద్ధికి అండగా నిలిచాడంటూ నినదించాడు. పోలీసులు మాతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతారని అన్నాడు. అప్పుడప్పుడు తమకు బిందెలు, బోళ్లు లాంటివి పంపిణీ చేస్తుంటారని తెలిపాడు.
“తినడానికి తిండి లేదు. నెత్తిమీద జుట్టు కత్తిరించుకోడానికి కూడా డబ్బులు లేవు. పొయ్యి కాడ కూసొని ఆలోచిస్తున్న. బియ్యం కొన్నే ఉన్నయి. ఈసారి వండుకుంటే తెల్లారి బువ్వ లేనట్టే. అందుకే ఆకలిని ఎంత వరకు భరించగలుగుతామో అంతవరకు భరించి.. ఆ తర్వాత తప్పని పరిస్థితుల్లోనే ఆ బియ్యంతో అన్నం వండుకుందామని అనుకున్న. అంతటి దుర్భర పరిస్థితులు మావి. ఆ సమయంలోనే తెలంగాణ స్వరాష్ట్ర కల నెరవేరింది. అప్పటి స్పీకర్ మధుసూదనచారి మా ఊరుకొచ్చిండు. దిగాలుగా ఉన్న నన్ను గమనించి పిలిచిండు. కేసీఆర్ మీకోసం పంపించిండు నన్ను. ఏం కష్టాలు ఉన్నయో చెప్పు? అని అడిగిండు. నాకు దుఃఖం తన్ను కొచ్చింది. నా కష్టం వివరించిన. వెంటనే అక్కడి అధికారులను పిలిచి ఫారెస్ట్కు సంబంధించిన వాచర్ ఉద్యోగం పెట్టించిండు. ఇక ఆనాటి నుంచి క్రమేణా ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను అందుకుంటూ సంతోషంగా గడుపుతున్నం. రేషన్ బియ్యం అందుతున్నయి” అంటూ గంగయ్య గతం తాలూకు కష్టాలు.. వర్తమానంలోని సంతోషాలు పంచుకున్నాడు. ఇలా ఏ చెంచు పెంట వాసులను కదిలించినా ఒక్కటే మాట.. ‘కేసీఆర్ వచ్చాకే మా జీవితాల్లో వెలుగులు నిండాయి. ఆయనే మా కష్టాలు తీర్చాడు’ అంటూ గొంతెత్తున్నారు.
“తెలంగాణ రాకముందు ఆరోగ్యం బాగలేకపోతే .. ఆసుపత్రికి వెళ్లేందుకు గుంజకు చెద్దరు కట్టి అందులో రోగిని పడుకోబెట్టి పదుల మైళ్ల దూరం నడిచి తీసుకెళ్లే వాళ్లం. కొందరు మార్గమధ్యలోనే చనిపోయేవారు. ఇంటినుంచి అడవి దాటి మళ్లీ ఇంటికొచ్చే వరకు నీళ్లు తాగకపోయేది. పొరపాటున తాగితే.. ఎప్పుడైనా నీళ్లు లేని దుస్థితి వస్తే తట్టుకునే శక్తి ఉండదేమోననే భయపడేవాళ్లం. అట్లాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు అనారోగ్యం బారిన పడకుండా వైద్యులు ఇండ్లకు వచ్చి మందులు ఇస్తుండ్రు, రక్తపరీక్షలు జేస్తుండ్రు. పెద్దాసుపత్రులకు తీసుకెళ్లి ఉచితంగా వైద్యం అందిస్తుండ్రు. అంబులెన్స్లు అందుబాటులో ఉన్నాయి. వాహనాలకు వెళ్లేందుకు వీలుగా రోడ్డు మార్గం ఏర్పాటు చేశారు. కేసీఆర్ దయతో మా బతుకులు మారుతున్నాయి. నెమ్మదిగానైనా ఇతర సమస్యలు కూడా పరిష్కరిస్తారనే నమ్మకం ఉంది” అని కొల్లం పెంటకు చెందిన ఈదయ్య చెప్పిండు. నిజానికి ఇది ఊరందరి మాట.
“ఒకప్పుడు పట్టించుకునేవాళ్లులేక చిన్నతనంలోనే పిల్లలకు పెండ్లిల్లు జేసేవాళ్లం. కేసీఆర్ వచ్చాక ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వం నుంచి కల్యాణలక్ష్మి డబ్బులు వస్తున్నాయి. పెండ్లి వయసులో పెండ్లి జేస్తేనే ఆ డబ్బులు వస్తాయని అధికారులు జెప్పిండ్రు. పిల్లలను చదివించడానికి అన్నీ ఉచితంగా అందించారు. గిప్పుడు మా పెంటల్లో ఎవ్వరూ బాల్య వివాహాలు చేయడం లేదు. మనవలు, మనవరాళ్లు బడికి పోతుండ్రు. చిన్న పిల్లలకు గుడ్డు, రాగి సంకటి అందిస్తున్నారు.” అంటూ అప్పాపూర్ పెంటకు చెందిన మొగిలి చెప్పాడు. తాము పత్తి, మొక్క, కంది లాంటి పంటలు పండిస్తున్నామన్నాడు. గతంలో చెంచుల కోసం కేటాయించిన రూ.46 కోట్లు ఉపాధి హామీ నిధులు దారి తప్పించిన నీచ చరిత్ర ఉమ్మడి పాలకులదని రాయమల్లు అనే చెంచు విరుచుకుపడ్డాడు.
తెలంగాణ చెంచుల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నది. అడవిని వదిలి వెళ్లాలంటూ కేంద్రం ఆ అమాయకులను నిబంధనల పేరుతో వేధిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఆ దాడులను ఖండిస్తూ.. ఆయా ప్రాంతాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నది. ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తెలంగాణ పేదరిక నిర్మూలన సంస్థ సేకరించిన లెక్కల ప్రకారం.. మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 7,500 కుటుంబాల్లో 17,500 మంది చెంచులు ఉన్నట్టు సెర్ప్ గుర్తించింది. ఇందులో ప్రధానంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నల్లమల అడవి లోయల్లో నివసిస్తున్న చెంచుల జనాభా రోజురోజుకూ తగ్గుతున్నదని గుర్తించింది. వారి సంఖ్య గతంలో 40 వేలు ఉండేది. ప్రస్తుతం పదివేలకు పడిపోయిందని లెక్కలు చెబుతున్నాయి. ఇట్లా అయితే చెంచు జాతి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది.
వారి సంక్షేమానికి అవసరమైన నిధులను ట్రైబల్ సబ్ ప్లాన్ ద్వారా విడుదల చేసింది. పౌష్టికాహారం లేకపోవడం, గుడుంబాకు బానిసవ్వడం, తీవ్ర అనారోగ్యాలు.. చెంచుల మరణాలకు కారణమని గుర్తించింది. అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నది. పిల్లల చదువు, పోషణ కోసం బాలబడులను ప్రారంభించింది. గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసింది. చెంచు పిల్లలకు గుడ్డు, రాగి సంకటి తదితర పౌష్టికాహారం అందిస్తున్నది. చెంచు మహిళలకు ప్రసవమంటే గండమే. దీంతో ప్రసూతి మరణాలను తగ్గించేందుకు .. కాన్పు సమయంలో వారిని మెటర్నిటీ హాస్పిటల్స్కు తరలించేలా ఏర్పాట్లు చేశారు. విద్యావంతులను ఎంపికచేసి ప్రాథమిక చికిత్సలో వారికి నిమ్స్లో శిక్షణ కూడా ఇచ్చారు. ఉచిత వైద్యం, వసతులు కల్పిస్తున్నారు. సోలార్ పరికరాలతో మల్లాపూర్, అప్పాపూర్, బౌరాపూర్, రాంపూర్, ఈర్లపెంటలో ఇంటింటికి నల్లా నీరు అందిస్తున్నారు. చెంచుల పండుగలు, చెంచు మహాసభలు నిర్వహించి చెంచుల ఆత్మగౌరవం నిలబెడుతున్నారు. రైతుబీమాతో అండగా నిలుస్తున్నారు. వారి కనీస జీవన కాలం తక్కువగా ఉండటంతో పింఛన్ అర్హత వయసు తగ్గించే ఆలోచనలు చేస్తున్నారు.
ప్రతీ చెంచు జీవితంలోనూ వెలుగులు!!
నాగర్ కర్నూల్లోని మల్లాపూర్, అప్పాపూర్, బౌరాపూర్, వెంకటేశ్వర్లబావి, కొమ్మన్ పెంట, పెట్రోల్ చేను తదితర పెంటల వాసులతో పాటు నల్గొండ, రంగారెడ్డి పెంటల చెంచులంతా సీఎం కేసీఆర్కు జై కొడుతున్నారు. ఉమ్మడి ప్రభుత్వాలు తమకు చేసిన అన్యాయాలను మరువమంటూ కన్నెర్రజేశారు. తమ ముఖాల్లో నవ్వులకు కారణమైన కేసీఆర్ను మళ్లీ గెలిపించుకుంటామంటూ పిడికిలి బిగించారు. చెంచుల మాటలు.. వాళ్ల భుజాన వేలాడే విల్లంబుల్లా పదునుగా ఉంటాయి. ఆ మనసులు మాత్రం అడవి తేనెలా తీయనివి, సుతిమెత్తనివి.
…? ఇడుమాల కిరణ్ కుమార్
గోపి, మహబూబ్నగర్