నల్లగొండ : యాసంగి సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే తప్పనిసరిగాకొనుగోలు చేయాలంటూ నల్లగొండ జడ్పీ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఆదివారం ఉదయం జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్తు సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి జగదీశ్ రెడ్డి హాజరుకాగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు.
సమావేశం ప్రారంభం కాగానే తెలంగాణ రాష్ట్రంలో ఈ యాసంగి సీజన్ లో రైతులు పండించిన ప్రతి గింజను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే తప్పనిసరిగా కొనుగోలు చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు.
ఇదే విషయాన్ని ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆ తీర్మానం ప్రతిని కేంద్ర ప్రభుత్వనికి పంపాలని నిర్ణయించారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.