నల్లగొండ : జిల్లాలోని నకిరేకల్ బస్టాండ్ దశాబ్దం అనంతరం పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. అప్పటి రవాణాశాఖ మంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ బస్టాండ్కు శంకుస్థాపన చేశారు. కాగా దశాబ్దానికి పైగా బస్టాండ్ వినియోగంలో లేకుండా పోయింది. రూ.20 లక్షల వ్యయంతో బస్టాండ్ తిరిగి పునరుద్ధరించబడింది. ఉమ్మడి ఏపీలో రవాణాశాఖ మంత్రిగా ఉన్న కె. చంద్రశేఖర్ రావు 5 మార్చి,1999న నకిరేకల్ ఆర్టీసీ బస్టాండ్కు శంకుస్థాపన చేశారు. అనంతరం 4 జనవరి,2001న అప్పటి గనులశాఖ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి ఈ బస్టాండ్ను ప్రారంభించారు. జాతీయ రహదారి-65కు సమీపంలో ఈ బస్టాండ్ ఉంటుంది. చుట్టుప్రక్కల 40 గ్రామాల ప్రజలు హైదరాబాద్, విజయవాడ, నల్లగొండకు రావాలంటే నకిరేకల్కు చేరుకోవాల్సిందే.
కాగా వివిధ కారణాలతో 2010 నుంచి ఈ బస్టాండ్ వినియోగంలో లేకుండా పోయింది. దీంతో శిథిలావస్థకు చేరుకుంది. దీంతో స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చొరవతో రూ.20 లక్షల నిధుల వ్యయంతో ఈ బస్టాండ్ను పునరుద్ధరించి తిరిగి ప్రజల వినియోగంలోకి తీసుకువచ్చారు.
టీఎస్ఆర్టీసీ నల్లగొండ రీజినల్ మేనేజర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. బస్టాండ్ పునరుద్ధరణలో భాగంగా ప్రయాణికుల సౌకర్యార్థం టాయిలెట్లను నిర్మించినట్లు తెలిపారు. వాహనాల పార్కింగ్కు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రతీ డీలక్స్, ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సు బస్టాండ్లోకి వస్తుందన్నారు. బస్సుల సమయ వేళలను తెలిపే పట్టికను డిస్ప్లే చేసినట్లు వెల్లడించారు.
స్థానికుడు నల్ల అంతయ్య మాట్లాడుతూ.. బస్సుల కోసం పట్టణంలోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద వేచి ఉండాల్సి వచ్చేది. ఎండైనా, వానైనా తమ మార్గాల్లో ప్రయాణించే బస్సుల కోసం 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు వేచి ఉండాల్సి వచ్చేంది. దీంతో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అంతేకాకుండా జన సమూహంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుండే. బస్టాండ్ను తిరిగి ప్రారంభించడంతో ఈ సమస్యలన్నీ తీరినట్లు అయినవి పేర్కొన్నాడు.