హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : అత్యున్నత ప్రమాణాలు పాటించే డిగ్రీ కాలేజీలకు జారీచేసే న్యాక్ గుర్తింపును సొంతం చేసుకొనేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు పోటీపడుతున్నాయి. మొత్తం 130 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలుంటే ఇప్పటివరకు 85
కాలేజీలు న్యాక్ గుర్తింపు దక్కించుకొన్నాయి. మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కామారెడ్డి, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సత్తుపల్లి ఏ గ్రేడ్స్ను సొంతం చేసుకొన్నాయి. ఈ రెండింటినీ కలుపుకొంటే న్యాక్ గుర్తింపు పొందిన కాలేజీల సంఖ్య 85కి చేరింది. ఇటీవల 5 కాలేజీలు న్యాక్ గుర్తింపు కోసం నివేదికలు సమర్పించగా, మరో 5 కాలేజీలు కూడా న్యాక్ బాటలో సాగుతున్నాయి.
అటానమస్ హోదా..
ఇప్పటికే రాష్ట్రంలో న్యాక్ ఏ గ్రేడ్ గుర్తింపు పొందిన 11 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు అటానమస్ హోదాను దక్కించుకొన్నాయి. తాజాగా ఈ విద్యాసంవత్సరం 7 కాలేజీలు న్యాక్ – ఏ గ్రేడ్ను కైవసం చేసుకొన్నాయి. ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ బేగంపేట ఏ ప్లస్ గ్రేడ్ గుర్తింపు పొందింది. ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ ఖమ్మం, ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ నల్లగొండ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ పాల్వంచ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నర్సంపేట, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యానగర్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ బిచ్కుంద, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కామారెడ్డి, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సత్తుపల్లి ఏ గ్రేడ్ను దక్కించుకొని అటామనస్ హోదా దిశలో సాగుతున్నాయి.