హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ‘నా తెలంగాణ’ పోటీల విజేతలకు శుక్రవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో బహుమతుల ప్రదానోత్సవం జరుగనున్నది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచిన ‘నమస్తే తెలంగాణ’ దిన పత్రిక ఆవిర్భవించి 11 ఏండ్లు అయిన సందర్భంగా ఎనిమిదేండ్ల తెలంగాణ రాష్ట్ర ప్రగతిని విశ్లేషించాలని పేర్కొంటూ.. ‘ప్రగతి ప్రస్థానం.. సాహితీ సప్తాహం’ పేరిట కవిత, పద్యం, పాటల పోటీలు నిర్వహించింది. దీనికి యువ రచయితలు, రచయితలు, కవులు, కళాకారుల నుంచి విశేష స్పందన లభించింది.
ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి శుక్రవారం ఉదయం 10 గంటలకు రవీంద్రభారతిలోని మినీహాలులో విశిష్ఠ అతిథి, ప్రముఖ రచయిత్రి డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి చేతులమీదుగా బహుమతులు అందజేస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, అధికార భాషా సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి, దాశరథి కృష్ణమాచార్య కుమార్తె ఇందిర, భాషా సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ హాజరుకానున్నారు.