Yadadri | యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అద్భుత ఆశ్చర్యాలతో కూడిన ఆనందానిచ్చే ఆలయమని మైసూరు అవధూత దత్తపీఠం జూనియర్ పీఠాధిపతి శ్రీదత్త విజయానంద తీర్థ స్వామీజీ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో 7 అద్భుతాలున్నాయని, ప్రస్తుతం మనం 8వ అద్భుతమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఉన్నట్లు అనిపిస్తున్నదని చెప్పారు. శుక్రవారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
స్వామివారిని దర్శించుకున్న అనంతరం స్వామీజీ ఆలయ ముఖ మండపంలో ఆయన స్వామివారి మహిమలు, వెలిసిన తీరు, ఆలయ వైభవాన్ని కీర్తించారు. ఆలయాలు అద్భుతంగా, అశ్చర్యంగా ఉంటాయని కానీ, యాదగిరిగుట్ట స్వామివారి ఆలయం ఆనందకరంగా రూపుదిద్దుకున్నదని చెప్పారు. ఎంతో ప్రసన్నతని చేకూర్చే ఆలయమని అన్నారు. స్వామివారి అనుగ్రహం కలిగి తీరిందనే భావన కలిగించే ఆలయమని తెలిపారు. ఎన్నో యుగాలుగా భక్తులకు దర్శనమిస్తున్న ఆలయమని చెప్పారు.
యాదమహర్షి తపస్సుతో ప్రసన్నమై స్వామి వారు దర్శనమిచ్చారని, జ్వాల నృసింహస్వామి, యోగానంద నృసింహస్వామి, లక్ష్మీనృసింహస్వామి రూపాలను ఇక్కడ విశేషంగా దర్శించుకుంటున్నామని తెలిపారు. ఇలాంటి అద్భుతమైన క్షేత్రానికి 2013లో వచ్చామని, ఆ తరువాత స్వామివారి ఆజ్ఞతో మరోసారి దర్శించుకునేందుకు వచ్చిన్నట్లు వెల్లడించారు. ఆప్పటికి ఇప్పటికి ఆలయం నవీకరణ చెంది అద్భుతమైన ఆలయంగా రూపొందిందని కితాబునిచ్చారు. అన్ని వసతులతో యాదగిరిగుట్ట ఆలయంగా అద్భుతంగా విరాజిల్లుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎన్. గీత, డీఈవో దోర్బాల భాస్కర్శర్మ, ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, ఆలయ అర్చకులు, అధికారులు, పురోహితులు, పారాయణదారులు పాల్గొన్నారు.