నాగర్కర్నూల్, జూలై 15: నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో గురువారం ‘దిశ’ సమీక్ష సమావేశంలోని తన మాటలను వక్రీకరిస్తూ పలు మీడియా సంస్థలు సంచలనం కోసం ప్రసారం చేయడాన్ని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచిందన్నారు. ఏ ప్రభుత్వమూ ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పించలేదని, ఉద్యోగం అంటేనే ఉపాధి అని.. అది కల్పించడం ప్రభుత్వ విధి అన్నారు. ఈ వ్యాఖ్యలను పలు మీడియా సంస్థలు వక్రీకరించి నిరుద్యోగులను హమాలీ పని చేసుకోమన్నారని ప్రచారం చేయడంపై విచారం వ్యక్తం చేశారు. మీడియా సంచనాల కోసం కాకుండా వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.