భారత దేశానికి స్వాతంత్య్రం ఇస్తున్నట్టుగా బ్రిటిష్ ప్రభుత్వం చట్టం చేసింది. అటు పల్లెలు, పట్టణాలు ఆనందోత్సాహాలతో వెలిగిపోతుంటే ఇక్కడ (హైదరాబాద్ దక్కన్ ప్రాంతంలో) మాత్రం గాఢాంధకారం అలముకున్నది. మాకూ స్వాతంత్య్రం కావాలని, భారత దేశంలో ఈ ప్రాంతం కలవాలని చాలా మంది నినదించారు. కొన్ని ఉద్యమాలు లేవదీశారు. వాటిలో వరంగల్లు నగరంలో జరిగిన ఘటన చరిత్రాత్మకమైనది. మొగిలయ్య త్యాగం మరువలేనిది.
స్వాతంత్య్రం కావాలని, భారత్లో కలవాలనే కాంక్షతో ఉన్న ఆంధ్ర మహాసభ నాయకులు, కమ్యూనిస్టులు వరంగల్ కోటలో జాతీయ జెండా ఎగురవేయాలని తీర్మానించారు. ఆగస్టు 9న తెల్లవారిన కాసేపటికే వరంగల్లు కోట పరిసరాలు నినాదాలతో హోరెత్తాయి. వందలమంది వలంటీర్లు మహాత్మాగాంధీకి జై, కాంగ్రెస్కు జై, త్రివర్ణ పతాకానికి జై, భారత మాతకు జై అంటూ నినాదాలు చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు కోటపై మువ్వన్నల జెండా ఎగురవేశారు. వలంటీర్లలో ఒకడైన మొగిలయ్య గట్టిగా నినదిస్తుంటే, మిగతావారంతా ఆయన్ని అనుసరించారు. ఇంతలోనే ఓ దుండగుల ముఠా కోటలోకి వచ్చింది. నినాదాలిస్తున్న మొగిలయ్యపై విరుచుకుపడింది. అందులో ఒకడు మొగిలయ్యను బల్లెంతో పొడిచి చంపాడు. మొగిలయ్య ప్రాణత్యాగం నాటి యువతకు స్ఫూర్తిగా నిలిచింది.
ఎన్నాళ్ళనుండియో ఇదిగో అనుచు
ఈనాటికైనను దిగివచ్చితివా?
కోట గోడల మధ్య ఖూనీ జరిగినచోట
గుండాల గుర్తులు గోచరించినవా
జెండా యెత్తిన జంబియాలు చూసిన
రక్తం తప్పదంచు చెప్పి వచ్చితివా?
– కాళోజీ (మొగిలయ్యకు అక్షర నివాళి)