ఖైరతాబాద్, అక్టోబర్ 3: ఆరోగ్యకరమైన జర్నలిజాన్ని అందించేందుకు తెలంగాణ ఆన్లైన్ జర్నలిస్టు యూనియన్ పనిచేయాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పిలుపునిచ్చారు. ఇది చూస్తే షాక్ అవుతారు.! అంటూ ఆన్లైన్లో వీడియోలు పెట్టేవారు జర్నలిస్టులే కాదని స్పష్టంచేశారు. ఏడేండ్లలో లక్షల యూట్యూ బ్ చానెళ్లు వచ్చాయని, లక్ష మందిలో 50 వేల మంది ‘షాక్ అవుతారు’ వంటి కథనాలే ప్రసారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన తెలంగాణ ఆన్లైన్ జర్నలిస్టు యూనియన్ ఆవిర్భావ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఒక చానెల్, ఆన్లైన్లో ప్రసారం చేస్తున్న అంశంలో న్యూస్ కంటెంట్ ఎంతనేది ముఖ్యమని చెప్పారు.
వార్తాంశాలు పెట్టేవారినే జర్నలిస్టులుగా గర్తించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆన్లైన్ విధానంలో నియంత్రణ లేని మాట నిజమేనని చెప్పారు. ప్రతి యూట్యూబర్కు అక్రిడిటేషన్లు ఇవ్వడం సాధ్యంకాదని స్పష్టంచేశారు. వార్త అంటే ఓ పద్ధతి, భాష ఉంటుందని తెలిపారు. ఇటీవల యూట్యూబర్లు భాష అనేది మరిచిపోయారని, పత్రికల్లో రాయలేని భాష వాడుతున్నారని అల్లం నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రా యాజమాన్యాలను ధిక్కరించి వార్తలు రాశామని, నాడు ఎంతో ఆరోగ్యకరమైన భాషను వినియోగించామని గుర్తు చేసుకున్నారు. అ
నంతరం తెలంగాణ ఆన్లైన్ జర్నలిస్ట్ యూనియన్ అడ్హక్ కమిటీని ప్రకటించారు. కన్వీనర్గా బీ శ్రీనివాస్, కో కన్వీనర్లుగా వెంకటేశ్, శ్రీనివాస్, సభ్యులుగా శ్రవణ్, దీక్ష, సాయిలును నియమించినట్టు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి ఏ రమణ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతిసాగర్, ఉపాధ్యక్షులు బీఆర్ లెనిన్, సీనియర్ జర్నలిస్టు పిట్టల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.