(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, నవంబర్ 7, (నమస్తే తెలంగాణ): ఓ రాష్ర్టానికి రాజ్యాంగబద్ధమైన గవర్నర్గా ఉంటూ.. తమిళనాడు పరిణామాలపై తరచుగా మాట్లాడుతుండటంపై డీఎంకే అధికార పత్రిక ‘మురసోలి’ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆమె మెడిసిన్ చదివినా.. రాజకీయ పరిజ్ఞానంలో మాత్రం ఎల్కేజీనే(జ్ఞానం శూన్యం) అని తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి ఎల్జీ తమిళిసై సౌందరరాజన్పై విరుచుకుపడింది. తమిళిసై, తమిళనాడు అధికార డీఎంకే పార్టీ మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని రీకాల్ చేయాలని డీఎంకే, దాని మిత్రపక్షాలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశాయి. గవర్నర్గా ఉన్నంత మాత్రాన భావ స్వేచ్ఛ ఉండదా? అంటూ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై మురసోలి తీవ్రంగా మండిపడింది. గవర్నర్ పదవిలో ఉండి రాజకీయాలు మాట్లాడుతున్నారంటే.. మెడిసిన్ చదువుకున్నప్పటికీ, రాజకీయ పరిజ్ఞానంలో మాత్రం ఎల్కేజీనే అని తమిళిసైపై ఘాటుగా స్పందించింది.
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఎన్నో మంచి పనులను పొగడలేక ఇక్కడ తమిళనాడు ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నది. ‘తెలంగాణలో మీ ఆటలు సాగక ఇక్కడ ఏదో చేయాలని చూస్తున్నారు. మీ పప్పులు ఉడకవు’ అని స్పష్టం చేసింది. తమిళిసై విమర్శలకు ప్రశ్న, జవాబు రూపంలో మురసోలి పత్రిక మరో కథనం ప్రచురించింది. ‘అగ్నిపర్వతంతో ఆడుకోకండి’ శీర్షికతో తమిళిసైని హెచ్చరించింది. రాజకీయాలంటే సినిమా, సీరియళ్లలో నటించినట్టు కాదంటూ తమిళిసై చేసిన వ్యాఖ్యలకు ఎంజీ రామ్చంద్రన్, జయలలితనే కాకుండా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా నటియేనని గుర్తుచేసింది. ‘వారసత్వ రాజకీయాలనేవి ఆయా పార్టీలకు సంబంధించిన అంశం.. దాన్ని అవి చూసుకుంటాయి. గవర్నర్కు సంబంధం లేదు’ అని పేర్కొన్నది.