హైదరాబాద్, నవంబర్ 5(నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నిక పుణ్యమా అని రెండు తెలుగు రాష్ర్టాల్లో బెట్టింగులు జోరందుకున్నాయి. బీజేపీ ఆర్భాటం చేయడం ద్వారా ఓటర్లలో అయోమయం సృష్టించడంతో బెట్టింగులకు ఊపొచ్చింది. హైదరాబాద్, గుంటూరు కేంద్రాలుగా ఈ బెట్టింగు వ్యవహారం నడిచినట్టు సమాచారం. టీఆర్ఎస్కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండడంతో సుమారు రూ.800 నుంచి రూ.1000 కోట్లు టీఆర్ఎస్వైపు బెట్టింగు కట్టగా, బీజేపీ వైపు రూ.500 కోట్లు కాసినట్టు తెలిసింది.
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పుడు బీజేపీ గెలుస్తుందనే ప్రచారం జరిగింది. ఆ పార్టీ అభ్యర్థి భారీగా డబ్బు ఖర్చుచేస్తారని, ఏకంగా కేంద్రం నుంచి ఆయనకు అన్నివిధాలుగా అండదండలు ఉండటంతో గెలుపు ఖాయమని చాలామంది అనుకున్నారు. సోషల్ మీడియాలో సైతం ఇలాంటి ప్రచారమే జరిగింది. అయితే, నామినేషన్ల ఘట్టం పూర్తై ప్రచారం ఊపందుకున్న తరువాత టీఆర్ఎస్ పైచేయి సాధించింది. గ్రామాలు, పట్టణాలు, మహిళలు, యువత తదితర వర్గాలు టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నట్టు వార్తలు రావడంతో టీఆర్ఎస్ గెలుస్తుందనే చర్చ మొదలైంది. దీంతో బెట్టింగు నిర్వాహకులు తమకు నష్టం జరగకుండా ఉండేందుకు బీజేపీ గెలుస్తుందనే టాక్ తీసుకొచ్చారు. వారు ఏకంగా మునుగోడుకు మకాంమార్చి ఎన్నికల ప్రచారాన్ని ప్రభావితం చేసి బీజేపీవైపు కూడా బెట్టింగ్ కాసేలా ప్రచారం చేశారు. దీంతో రెండు పార్టీలకు కాస్త అటుఇటుగా బెట్టింగ్ కాసేలా చేయడంలో నిర్వాహకులు సఫలమయ్యారు. కాంగ్రెస్పై పెద్దగా బెట్టింగ్ కాయలేదని తెలిసింది. మొత్తంమీద రెండు పార్టీలకు కలిపి రూ.1500 కోట్లవరకూ బెట్టింగులు కట్టినట్టు సమాచారం. నిర్వాహకులకు ఏడు నుంచి 10 శాతం వరకు కమీషన్ వస్తుందని, అంటే దాదాపు రూ.100 నుంచి 150 కోట్ల వరకు వారు లాభపడుతారని వినవస్తున్నది.