హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న టీఎస్బీపాస్ అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు మున్సిపల్ ఉద్యోగులపై పురపాలక శాఖ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఇంటి అనుమతికి దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను స్థానికంగా పరిశీలించే నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తు రాగానే వెంటనే పరిశీలించి ఆ వివరాలతో కూడిన నివేదికను రాష్ట్ర కార్యాలయానికి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు కింది స్థాయి ఉద్యోగులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీఎస్బీపాస్ పరిశీలనలో తెలింది.
ఈ నేపథ్యంలో భవిష్యత్లో అధికారులు, ఉద్యోగులు దరఖాస్తుల పరిశీలనలో సీరియస్గా వ్యవహరించాలనే ఉద్దేశంతో ఐదుగురు ఉద్యోగులను వేతనాల్లో రూ.5 వేల చొప్పున కోత విధించాలని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ సీడీఎంఏ ఎన్.సత్యనారాయణకు ఆదేశాలు జారీ చేశారు. మణిభూషన్(నర్సాపూర్ మున్సిపాలిటీ), కే యశ్వంత్ రెడ్డి( కామారెడ్డి), యాదయ్య(ఇబ్రహీంపట్నం), టీ సురేశ్(ఖమ్మం), అహ్మద్(మక్తల్ మున్సిపాలిటీ)లపై చర్యలు తీసుకున్నట్లు పురపాలక శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.