మునుగోడు, నవంబర్ 1: మునుగోడు ఉప ఎన్నికలో మనువాద, రిజర్వేషన్ వ్యతిరేక బీజేపీని ఓడించి దళిత పక్షపాతి టీఆర్ఎస్ను గెలిపించాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం నల్లగొండ జిల్లా మునుగోడులో సంఘం జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్నతో కలిసి మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీజేపీ సర్కారు ప్రభుత్వ సంస్థలను కార్పొరేటు శక్తులకు అప్పగించి, ఎస్సీ, ఎస్టీ బీసీలకు ఉద్యోగాలు లేకుండా చేసి పరోక్షంగా రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తున్నదని మండిపడ్డారు.
బీసీ జనగణన చేయకుండా వారి అభివృద్ధిని బీజేపీ అడుగడుగునా అడ్డుకుంటున్నదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం గిరిజనులకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు పెంచాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా గిరిజనులకు తీరని అన్యాయం చేస్తున్నదని కేంద్రంపై దుయ్యబట్టారు. కుల వ్యవస్థను బలపరిచేలా బీజేపీ చేస్తున్న కుటిల రాజకీయాలను ఎదుర్కోవడానికి ఓటే పరిష్కారమని చెప్పారు. టీఆర్ఎస్ను గెలిపించి, దళిత బహుజన వ్యతిరేక బీజేపీని రాజకీయంగా సమాధి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనా ర్టీలకు వ్యతిరేకంగా అనేకమైన చట్టాలను, నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీని ఓడించాలంటే దళిత సంక్షేమానికి కృషి చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.