ఖైరతాబాద్, డిసెంబర్ 13: ‘రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ చేవెళ్ల డిక్లరేషన్ను తూచా తప్పకుండా అమలు చేయాలి. రిజర్వేషన్లు పెంచిన తర్వాతే డీఎస్సీతోపాటు అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి’ అని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తొలి క్యాబినెట్లో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పారని, ప్రస్తుతం ఆ ప్రయత్నాన్ని విరమించుకోవడంతోపాటు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టవద్దని సూచించారు. ఆర్నెల్ల కాలంలో రిజర్వేషన్ల ప్రక్రియ చక్కదిద్దాలని, ఎస్సీలకు 15 నుంచి 18 శాతానికి, ఎస్టీ, మైనార్టీలకు 12 శాతం, బీసీల కులగణన చేపట్టి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచి డీఎస్సీ, ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఆర్థిక భారం లేని, బడ్జెట్తో పనిలేని రిజర్వేషన్ల పెంపు వంటి హామీలను నెరవేర్చాలని సూచించారు. రాష్ట్ర క్యాబినెట్లో 7 శాతం జనాభా ఉన్న కులాలకే అధిక పదవులు ఇచ్చి 80 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రం ఐదు పదవులే ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్కు 70 నుంచి 80 శాతం మంది ముస్లింలు ఓట్లు వేశారని, కానీ, వారికి ఇంత వరకు క్యాబినెట్లో ప్రాతినిధ్యం కల్పించలేదని చెప్పారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పొందుపర్చిన వృద్ధులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఆర్థికంగా ఉన్న వారికి కాకుండా పేద మహిళలకు, తెల్లరేషన్ కార్డుదారులకే వర్తించేలా నిబంధన పెట్టాలని సూచించారు. రైతుబంధు పేద రైతులకు మాత్రమే కేటాయిస్తే ప్రజాధనం వృథాకాదని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీ నెరవేర్చాలని, లేకుంటే అన్ని రూపాల్లో ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు సీహెచ్ సోమశేఖర్, ఎంఎంఎస్ రాష్ట్ర నాయకులు జేపీ లత, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగళ్ల ఉపేందర్మాదిగ, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్, నాయకులు వీఎస్ రాజు, టీవీ నర్సింహ, మల్లికార్జున్, రామారపు శ్రీనివాస్, శివ మాదిగ, అరుణ్మాదిగ తదితరులు పాల్గొన్నారు.