హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ)/ అమీర్పేట్: తాను ప్రారంభించిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం విజయవంతం వెనుక చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి పాత్ర ఉన్నదని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు ప్రశంసించారు. కేవలం ఆరు వాహనాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా రంజిత్రెడ్డి ప్రజాప్రతినిధులందరినీ సమన్వయం చేస్తూ వాటి సంఖ్యను వందకు తీసుకెళ్లారని కొనియాడారు. డాక్టర్ రంజిత్రెడ్డి తన జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం బేగంపేటలోని హోటల్ హరితప్లాజాలో దివ్యాంగులకు త్రిచక్ర వాహనాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ద్వారా ఆపదలో ఉన్నవారికి సహాయపడేలా అంబులెన్స్లు, దివ్యాంగులకు వాహనాలు అందజేయడం గొప్ప విషయమని చెప్పారు. గిఫ్ట్ ఏ స్మైల్ అనే చక్కటి ఆలోచనకు రంజిత్రెడ్డి మరింత చక్కటి రూపం ఇచ్చారని అభినందించారు. చేవెళ్ల ఎంపీగా గత రెండేండ్లలో మంచి మనస్సును చాటుకున్నారని కొనియాడారు. యువతకు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటుచేయడంతోపాటు కరోనా కాలంలో డిజిటల్ విద్యాబోధనకు ఉపయోగపడేలా తన నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కలర్ టీవీలు అందజేశారని గుర్తుచేశారు.
హరీశ్.. సివిల్స్ సాధించాలి
త్రిచక్ర వాహనాన్ని అందుకొనేందుకు వచ్చిన పెద్దేముల్ మండలం ఇందూర్ గ్రామానికి చెందిన దివ్యాంగుడు హరీశ్కుమార్తో మంత్రి కేటీఆర్ కాసేపు ముచ్చటించారు. తాను సివిల్స్కు సన్నద్ధమవుతున్నట్టు హరీశ్ చెప్పారు. తప్పకుండా సివిల్స్ సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.