ఖైరతాబాద్, మార్చి 11 : డీఎస్సీతో పాటు టెట్ నిర్వహించాలని నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ సైఫాబాద్లోని విద్యాశాఖ కమిషనరేట్ను ముట్టడించింది. అనంతరం జేఏసీ నేతలు ధర్నా నిర్వహించగా, ఎంపీ ఆర్ కృష్ణయ్య పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. గతంలో ప్రతిసారి డీఎస్సీతో పాటు టెట్ కూడా నిర్వహించేవారని కృష్ణయ్య గుర్తుచేశారు.
కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో టెట్ నిర్వహించిన తర్వాత ఆయా పోస్టులను భర్తీ చేశారని తెలిపారు. పీఆర్సీ కమిటీ రిపోర్టు ప్రకారం.. ప్రభుత్వ బడుల్లో ఖాళీగా ఉన్న 24వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని కృష్ణయ్య కోరారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, బీసీ ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడు జీ అనంతయ్య, బీసీ విద్యార్ధి సేన అధ్యక్షుడు వేముల రామకృష్ణ, నేతలు ఉదయ్, జయంతి, కృష్ణ, చందు తదితరులు పాల్గొన్నారు.