ములుగు, జూలై 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని సాధించేంతవరకు పోరాడుతామని మానుకోట ఎంపీ మాలోత్ కవిత అన్నారు. శనివారం ములుగులో మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన నిరాహార దీక్షకు ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ములుగు జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ కుంటిసాకులు చెప్తూ విభజన హామీలను తుంగలో తొక్కిందని అన్నారు. అవసరమైతే గిరిజనులతో కలిసి ఢిల్లీ వెళ్లి నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ దీక్షలో బీఆర్ఎస్ ములుగు జిల్లా ప్రజాప్రతినిధులు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.