హైదరాబాద్ : సైదాబాద్ చిన్నారి హత్యాచార కేసు నిందితుడు పల్లకొండ రాజు.. రాజారాం బ్రిడ్జి వద్ద కోణార్క్ ఎక్స్ప్రెస్కు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అతని రెండు చేతులపై ఉన్న పచ్చబొట్ల ఆధారంగా మృతుడిని రాజుగా పోలీసులు గుర్తించారు. రాజు రెండు చేతులపై మౌనిక అనే పచ్చబొట్టు ఉంటుందని పోలీసులు ఇటీవల విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే.
పల్లకొండ రాజు రెండేండ్ల క్రితం సూర్యాపేట జిల్లా జలాల్పురం గ్రామానికి చెందిన మౌనిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తన భార్య పేరును రెండు చేతులపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఒక చేతిపై ఇంగ్లీష్లో, మరో చేతిపై తెలుగులో మౌనిక అని రాయించుకున్నాడు. రాజు భార్య ప్రసవం కోసం ఏడాది క్రితం జలాల్పురం వచ్చి అక్కడే ఉంటున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. రెండు వారాల క్రితం జలాల్పురం వెళ్లిన రాజు మద్యం మత్తులో.. తన అత్తపై దాడి చేసినట్లు తేలింది. కుటుంబ సభ్యులు దాడి చేస్తారేమోనని భయపడి హైదరాబాద్కు తిరిగి వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
నిందితుడి రాజు అసలు ఊరు జనగామ జిల్లా కొడకండ్ల మండలం కాగా బతుకుతెరువు కోసం అతను పుట్టకుముందే అతని తల్లిదండ్రులు హైదరాబాద్ కు వచ్చినట్టు విచారణలో తెలిసింది. అతని తండ్రి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడని, దానికి కారణం కొడకండ్లలో ఉండే అతని బాబాయిలని అనుమానం. అయితే ఇప్పటివరకూ వారి కుటుంబాల మధ్య ఎలాంటి మాటలు కానీ, రాకపోకలు కానీ లేవు. రాజుకు అక్క ఉండేదని, హైదరాబాద్ లో నివాసం ఉన్నప్పుడే యాదాద్రి జిల్లా అడ్డగుడూరుకి చెందిన ఓ అబ్బాయితో ఆమె వివాహం జరిగినట్టు ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. నిందితుడు ఎప్పుడూ ఏదో మైకంలో ఉండే వాడని, సెల్ ఫోన్ కూడా వాడేవాడు కాదని అతన్ని గమనించిన వాళ్ళు చెప్పారు.