వెంగళరావునగర్, మార్చి 14: పెండ్ల్లి రోజును భర్త తనను, బిడ్డలను పట్టించుకోలేదని భావించిన ఆ ఇల్లాలు క్షణికావేశానికి లోనైంది. పేగు తెంచుకొని పుట్టిన ఆ బిడ్డల గొంతునులిమి, ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకొన్నది. హైదరాబాద్ బోరబండ పెద్దమ్మనగర్లో జరిగిన ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం అలుముకున్నది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఏపీ అమలాపురానికి చెందిన మురళీవేణు (33) 20 ఏండ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి పెద్దమ్మనగర్లో స్థిరపడ్డారు. విద్యుత్తు శాఖ కాంట్రాక్ట్ పద్ధతిలో జూనియర్ లైన్మన్గా పనిచేస్తున్నాడు. మందమర్రి, మంచిర్యాల జిల్లాకు చెందిన సత్యవేణి (33)తో ఏడేండ్ల క్రితం అతనికి వివాహమైంది. వారికి రుద్రాన్ష్ (5), తన్విక (2) సంతానం కలిగారు. గత కొంతకాలంగా మురళీవేణు తన తండ్రి కిడ్నీలకు రెండు రోజులకోసారి డయాలసిస్ చేయిస్తున్నాడు.
మురళీవేణు, సత్యవేణి దంపతుల పెళ్లిరోజైన శుక్రవారం సంబురంగా జరుపుకోవాలని ఆమె భావించింది. పిల్లలతో కలిసి ఆ రోజంతా గడుపుదామని భర్త వేణును ఆ ఇల్లాలు కోరింది. అదేరోజు తండ్రికి డయాలసిస్ చేయించేందుకు దవాఖానకు తీసుకెళ్లాలని, మరో రోజు చేసుకుందామని చెప్పి దవాఖానకు వెళ్లిపోయాడు. భర్త నిరాదరిస్తున్నాడని కన్నీటి పర్యంతమైన ఆ మహిళ ఐదేండ్ల కుమారుడైన రుద్రాన్ష్, రెండేండ్ల తన్విక గొంతు నులిమింది. అమ్మా.. అమ్మా.. అని ఏడుస్తున్నా ఆ బిడ్డల రోదలను పెడచెవిన పెట్టిన తల్లి కర్కశంగా వ్యవహరించింది. బిడ్డలు చనిపోయి ఉంటారని భావించిన సత్యవేణి ఇంట్లోని ఫ్యానుకు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె అత్త ఇంటికొచ్చి చూసేసరికి కోడలు సత్యవేణి విగతజీవిగా మిగిలింది. పిల్లలను దవాఖానకు తరలించగా, రుద్రాన్ష్ చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన్వికకు చికిత్స చేస్తున్నారు. బోరబండ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.