నార్కట్పల్లి, జూన్ 21: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొన్నది. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా నడికుడి రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం చోటుచేసుకొన్నది. మృతుల స్వగ్రామం నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఔరవాణిలో విషాదం అలుముకొన్నది. ఔరవాణి గ్రామానికి చెందిన గాదె జాన్రెడ్డి, రమ్య ఎనిమిదేండ్ల క్రితం ప్రేమించి పెండ్లి చేసుకొన్నారు.
వీరు నల్లగొండ పట్టణంలోని చైతన్యపురి కాలనీలో సొంత ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. వీరికి రిషీక్ (8), హన్షిక్రెడ్డి (4) సంతానం. జాన్రెడ్డి చిరు వ్యాపారాలు చేస్తుంటాడు. ఇటీవల నార్కట్పల్లిలో పాత ఇనుప సామగ్రి సేకరణ వ్యాపారం ప్రారంభించాడు. నెల క్రితం జాన్రెడ్డి తండ్రి కొండల్రెడ్డి మృతిచెందాడు. ఈ నెల 18న తండ్రి నెలమాసికం ఉండటంతో భార్యా పిల్లలతో కలిసి జాన్రెడ్డి స్వగ్రామానికి వచ్చారు.
పిల్లలను పాఠశాలకు పంపించాలని అత్తకు చెప్పి రమ్య పిల్లలను తీసుకొని ఈ నెల 20న ఉదయం నల్లగొండ కు బయలుదేరింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన జాన్రెడ్డికి భార్యాపిల్లలు నల్లగొండ వెళ్లారని తెలియ డంతో రమ్యకు ఫోన్చేశాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ రావ డంతో నల్లగొండలోని ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది.
ఈ క్రమంలో గుంటూరు జిల్లా నడికుడి రైల్వే స్టేషన్ సమీపంలో ఇద్దరు పిల్లలు సహా రమ్య (28) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నదని సమాచారం తెలిసింది. తల్లీబిడ్డల బలవన్మరణంతో బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి.