మేడ్చల్ మల్కాజిగిరి : సీజనల్ అంటు వ్యాధులను అరికట్టే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.. డెంగీ, మలేరియా, చికెన్గున్యా లాంటి విష జ్వరాలకు కారణమయ్యే దోమలను లార్వా దశలోనే నియంత్రించే చర్యలు చేపడుతున్నట్లు కార్మిక శాఖా మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు.. 10 వారాలపాటు ఇంటి పరిసరాలలో పరిశుభ్రత కార్యక్రమాన్ని కూకట్పల్లి సర్కిల్లోని ఓల్డ్ బోయిన్పల్లిలో మంత్రి మల్లారెడ్డి నివాసంలో నిర్వహించారు.
కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో పాటు జోనల్ కమిషనర్ వి.మమత, సర్కిల్ ఉప కమిషనర్ పి.రవీందర్కుమార్, ఎంటమాలజీ సీనియర్ అసిస్టెంట్ లచ్చిరెడ్డిలు పాల్గొన్నారు. మంత్రి మల్లారెడ్డి సమక్షంలో ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలను పరిశీలించి, నీటిలో దోమ వృద్ధిచెందే విధానాన్ని అధికారులు వివరించారు.
ఇంటి ఆవరణలోని ఖాళీగా ఉన్న టైర్లలో నీటి ఆవాసాలను గుర్తించి రసాయనాలను పిచికారి చేశారు. అనంతరం పరిశుభ్రత కార్యక్రమం అవగాహన కరపత్రాలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందన్నారు. ప్రభుత్వ వైద్యశాలలను బలోపేతం చేస్తూ సకల సదుపాయాలను కల్పిస్తుందన్నారు. ప్రజలందరూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.