హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొన్ని రోజులుగా కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 129 కేసులు వెలుగుచూశాయి. పాజిటివిటీ రేటు స్వల్పంగా పెరిగి 0.97 శాతంగా నమోదైంది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,039కి పెరిగింది. మరోవైపు 67 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వరుసగా రెండో రోజు హైదరాబాద్ జిల్లా పరిధిలో కేసుల సంఖ్య వంద దాటింది. ఆదివారం 104 మందికి పాజిటివ్గా తేలింది. రంగారెడ్డి జిల్లాలో 9, మేడ్చల్లో 8 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొవిడ్ కేసులు వారం రోజుల్లోనే రెట్టింపయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజలు కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.