స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
నస్రుల్లాబాద్, సెప్టెంబర్ 4: సంక్షేమ పథకాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో రూ.2.16 కోట్ల నిర్మించిన 40 డబుల్ బెడ్రూం ఇండ్లతోపాటు రైతువేదిక, జడ్పీ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులను కలెక్టర్ జితేశ్ వీ పాటిల్తో కలిసి స్పీకర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. నిరుపేదల ఆత్మగౌరవం కోసం డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించి ఇస్తున్నదన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో మొదటి విడతలో 110 గ్రామాల్లో ఐదువేల ఇండ్లు నిర్మించినట్టు చెప్పారు. 114 గ్రామాలకు మరో 5 వేల ఇండ్లను మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. ఇవీగాక మరో ఐదువేల ఇండ్లను తీసుకొస్తామన్నారు.