ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 5: దేశంలో ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాదంలో పడిపోయిందని, అత్యున్నత వ్యవస్థలైన సీబీఐ, ఈడీ, ఎన్నికల కమిషన్, న్యాయవ్యవస్థ, మీడియా స్వయం ప్రతిపత్తిని కోల్పోతున్నాయని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణహిత ఫౌండేషన్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కల్చరల్ అండ్ సోషల్ స్టడీస్ ఆధ్వర్యంలో ‘డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్: సోషల్ ట్రాన్స్ఫార్మేషన్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ డెమోక్రసీ’అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీలోని పీజీఆర్ఆర్సీడీఈ ఆడిటోరియంలో శనివారం జాతీయ సదస్సు నిర్వహించారు. దీనికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పాలన ప్రమాదకరంగా మారిందని, పెట్టుబడిదారులను పెంచి పోషిస్తున్నారని విమర్శించారు.
గౌతం అదానీ వివిధ బ్యాంకుల నుంచి రూ.2.5 లక్షల కోట్లు రుణాలు తీసుకొన్నారని, ఒకవేళ ఆయన వ్యాపారాలు దెబ్బతింటే దేశ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అవుతుందన్నారు. రాజకీయ పార్టీలకు అందే విరాళాల్లో 70 శాతం బీజేపీకే అందుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మాట్లాడుతూ.. పార్లమెంట్ను సైతం బలహీనపరుస్తున్న ఘనత మోదీకే దక్కిందని మండిపడ్డారు. మోదీ, బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు చైతన్యవంతులై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నదని విమర్శించారు.
పార్లమెంట్ను ఉత్సవ విగ్రహంలా మార్చేశారని, గత ఎనిమిదేండ్లుగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో బిల్లులపై ఎలాంటి చర్చ జరగడం లేదని అన్నారు. నిమిషాల వ్యవధిలో బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తున్నారని విమర్శించారు. సెంట్రల్ యూనివర్సిటీల టీచర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు, జేఎన్యూ ప్రొఫెసర్ ఆనంద్కుమార్ మాట్లాడుతూ.. పాలకులు తమ విధానాలను ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారని, దీనిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. సదస్సులో ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు ప్రొఫెసర్ సీహెచ్ హన్మంతరావు, రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ గట్టు సత్యనారాయణ, కోకన్వీనర్ రమణారావు, పీజీఆర్ఆర్సీడీఈ డైరెక్టర్ జీబీ రెడ్డి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గణేశ్ తదితరులు పాల్గొన్నారు.