నిజామాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్కు నిజామాబాద్ జిల్లా పర్యటనలో వింత పరిస్థితులు ఎదురవుతున్నాయి. శనివారం ఆమె నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి మండలం కొడిచర్ల దళితవాడను సందర్శించారు. ఈ సందర్భంగా భీమయ్య అనే యువ మోర్చా కార్యకర్త ఇంట్లో అల్పాహారం చేశారు. అయితే ఆ కుటుంబానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నుంచి పైసా ప్రయోజనం దక్కడం లేదు.
భీమయ్య కుటుంబానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఏడు పథకాల్లో లబ్ధి చేకూరింది. ఆఖరికి కేంద్రం గొప్పలు చెప్పుకొంటున్న కిసాన్ సమ్మాన్ యోజన పథకం కూడా వీరికి వర్తించడం లేదు. మూడేండ్లుగా ఈ-కేవైసీ పేరుతో ముప్పు తిప్పలు ఎదుర్కుంటున్నారే తప్ప మోదీ ఇస్తానన్న డబ్బులు తమకే రావట్లేదని బీజేపీ కార్యకర్తలే చర్చించుకొంటున్నారు. విశేషమేమిటంటే భీమయ్య తల్లి పేరిట ఉన్న దాదాపు 2 ఎకరాల వ్యవసాయ భూమికి మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు పెట్టుబడి సాయం అందుతున్నది. ఈ రెండెకరాల భూమి సాగుకు ఉచితంగా కరెంట్ సరఫరా సైతం కేసీఆర్ ప్రభుత్వం ద్వారానే అందుతున్నది.
భీమయ్య కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ఏడు పథకాల లబ్ధి చేకూరుతున్నది. అతని సోదరికి వికలాంగుల పింఛన్ రూ.3,016 అందుతున్నది. ఆమెకు శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి డబుల్ బెడ్రూం ఇంటిని మంజూరు చేసి అందజేశారు. భీమయ్య తల్లి సజ్జాబాయికి వృద్ధాప్య పింఛన్ రూ.2,016 వస్తున్నది. భీమయ్య ఇంటికి మిషన్ భగీరథ శుద్ధ జలాలు వస్తున్నాయి.
ఈ ఇంటికి మొత్తం మూడు మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఉన్నాయి. మిషన్ భగీరథ నీళ్లు తాగితే కేసీఆర్ సర్కారుకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న ఆలోచనలతో నిర్మలా సీతారామన్ అల్పాహార విందులో టాటా వాటర్ బాటిళ్లను ప్రత్యేకంగా తెప్పించుకొన్నారు. గాంధారిలో ప్రగల్భాలునిర్మలా సీతారామన్ తన పర్యటన చివరి రోజు కూడా ప్రగల్భాలు పలికారు. కామారెడ్డి జిల్లా గాంధారిలో రైతు సమ్మేళనం పేరుతో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ సర్కారులో రైతులకు ఎలాంటి లాభం జరగడం లేదంటూ చెప్పుకొచ్చారు.