నాడు దోచుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ
మోదీది ఈడీయిజం.. కేసీఆర్ది జనం విజన్
కేసీఆర్ను అనేముందు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి
మోదీకి దమ్ముంటే కేసీఆర్ ప్రశ్నలకు బదులివ్వాలి
బండి సంజయ్ నయా పైసకు కూడా కొరగాడు
పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): నాడు భారతదేశాన్ని బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దోచుకుం టే.. నేడు గుజరాత్ కంపెనీ ఇండియా దోచుకుంటున్నదని పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. హైదరాబాద్ గడ్డ మీద బీజేపీ నిర్వహిస్తున్నవి జాతీయ కార్యవర్గ సమావేశాలా..? లేక తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలా..? అని నిలదీశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను సీఎం కేసీఆర్ను తిట్టేందుకే పెట్టుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని చూసి బీజేపీ నేతలు ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. మోదీది ఈడీయిజం అయితే సీఎం కేసీఆర్ జ నం విజన్ అని పేర్కొన్నారు. ఆదివారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీపైనా, సీఎం కేసీఆర్పైనా కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాగూర్, స్మృతి ఇరానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వివేకానంద తీవ్రంగా ఖండించారు. సీఎం కేసీఆర్వి వారసత్వ రాజకీయాలు కావని, ప్రజారంజక రాజకీయాలని ఆయన చెప్పారు. బీజేపీ నేతలు తమ స్థాయి, హోదాను మరిచి మాట్లాడుతున్నారని, ఇక నుంచి ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరించారు. అద్భుతంగా పురోగమిస్తున్న తెలంగాణను చూసి ఓర్వలేక.. కక్షగట్టేందుకే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ఇక్కడ నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
బీజేపీకి ఓటింగ్ శాతం ఎక్కడ పెరిగింది?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కాదని వివేకానంద ఆగ్ర హం వ్యక్తం చేశారు. కరీంనగర్ చౌరస్తాలో నెత్తి మీద వంద రూపాయలు పెడితే పైసకు కూడా కొరగాడన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను పట్టుకొని చదవటం కాదు.. వాస్తవాలు తెలుసుకొని చదవాలని బండికి హితవుపలికారు. బీజేపీకి ఓటింగ్ శాతం ఎక్కడ పెరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానా ల్లో డిపాజిట్ కోల్పోయిన పార్టీ అధికారంలోకి వస్తామని కలలు కంటుందని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీకి దమ్ముంటే సీఎం కేసీఆర్ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
దోచుకోవడానికే మోదీ అండ్ కో
తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతుంటే ఓర్వలేక రాష్ర్టాన్ని దోచుకోవటానికి మోదీ అండ్ కో హైదరాబాద్ వచ్చిందని పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి మండిపడ్డారు. మోదీ దేశ ప్రజలకు ప్రధానిగా కాకుండాఅదానీ, అంబానీకి మాత్రమే ప్రధానిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రాష్ర్టాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు, కల్యాణ లక్ష్మి పథకాలు ఎందుకులేవని ప్రశ్నించారు. ప్రధాని నుంచి బీజేపీ పదాతిదళం అంతా ఒక్కటై వచ్చినా తెలంగాణ దళపతి సీఎం కేసీఆర్ ప్రజాదరణను వీసమెత్తుకూడా తొలగించలేరని తేల్చిచెప్పారు. ప్రొటోకాల్ గురించి బీజేపీ నేతలు తమకు చెప్పాల్సిన అవసరం లేదని సూచించారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ను 2009లో ఆహ్వానించని విషయాన్ని గుర్తుచేశారు. బండి సంజయ్ ఓ బచ్చా, అర్వింద్ ఓ లుచ్చా అని ధ్వజమెత్తారు.