ఎప్పుడో ఏడాదిన్నర క్రితం ఉత్పత్తి మొదలు పెట్టిన ఎరువుల కర్మాగారమది! ఇప్పటికే పది లక్షల టన్నులకుపైగా ఎరువులను ఉత్పత్తి చేయడమే కాకుండా.. సరఫరా కూడా చేసేసింది! కేంద్రం వాటా కాస్త ఎక్కువ ఉండటంతో లాంఛనంగా దీని ప్రారంభానికి ప్రధానిని పిలిచి.. హంగామా చేద్దామని రాష్ట్ర బీజేపీ నాయకత్వం గంపెడాశలు పెట్టుకుంది! ముహూర్తం ఎప్పుడా అని వెతికి వెతికి.. ఓ తేదీ అనుకున్నారు! అప్పటికే ఓ భారీ కొనుగోలు డ్రామాను విజయవంతంగా ముగించేస్తామని, ఆలోగా మునుగోడును నెగ్గి, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేస్తామని.. అటుపరి మోదీ గారు ‘రాజు వెడలె రవితేజములలరగ.. కుడిఎడమల డాల్ కత్తులు మెరియగ’ అన్నట్టు రాష్ట్ర ప్రవేశం చేసి.. చేతులూపుకొంటూ చేసే ఓ విజయహాసంతో గులాబీ శ్రేణులు కుంగిపోతాయని ప్లాన్లు గీసుకున్నారు!
కానీ.. డామిట్ కథ అడ్డం తిరిగింది! కేసీఆర్ దెబ్బకు కొనుగోలు డ్రామా అట్టర్ఫ్లాప్ అయింది.. మునుగోడు జనత ఈడ్చి తన్నింది!
కింకర్తవ్యం? తేదీ మార్చలేరు! రావాల్సిన ప్రధాని రాక మానరు! మరిప్పుడేం చెప్తారు? హామీలివ్వడం తప్ప ఆచరణలో నెరవేర్చని ఆరితేరిన నాయకుడు కాబట్టి.. సహజ శైలిలో మరికొన్ని వాగ్దానాలు కుమ్మరిస్తారా? బేరసారాల ఉదంతాన్ని కప్పిపుచ్చేలా కొత్త ఎత్తులేస్తారా? మునుగోడు అవమాన భారాన్ని మాయమాటలతో మూటగట్టేస్తారా?
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): చరిత్రలో చదువుకున్నాం.. ఎక్కడో అఫ్ఘానిస్తాన్లోని గజనీలో ఉండే ఒక రాజు వందల మైళ్ల దూరం దాటి వచ్చి సోమనాథ్ను దోచుకున్నాడని. సోమనాథ్ అత్యంత సంపన్న ఆలయం. ఆ సంపద కోసమే 17 సార్లు దండయాత్ర చేసి దోచుకుపోయాడు. నవభారతంలో సరిగ్గా అలాంటి మూకలు బయల్దేరాయి. ఎక్కడ సంపద కనబడితే అక్కడ వాలి, దోచుకుంటున్నాయి. తెలంగాణ వంటి సుసంపన్న రాష్ట్రం మీద కూడా అలాంటి నయా గజనీలు దాడి చేస్తున్నారు. ఇక్కడి అభివృద్ధికి మోకాలడ్డం పెడ్తరు. నిధులివ్వకుండా, రుణాలు రాకుండా చేసి పసిరాష్ట్రం ఉసురు తీయాలని చూస్తరు. కాళ్లల్ల కట్టెలు పెట్టి, ప్రచారాల విషాన్ని చిమ్మి, వందలకోట్లు కుమ్మరించి, కొనుగోళ్లు చేసే బ్రోకర్లను పంపి ప్రభుత్వాలను కూల్చే కుట్ర చేస్తున్నరు. ఆ ప్రయత్నంలో కెమెరా అద్దంలో దొరికిన దొంగలు.. ఇపుడు సిగ్గుపడకుండా మళ్లా వస్తరు. ఈ మాయలమారులు ఏం జరిగినా ఏమీ తెలియనట్టు మౌనం పాటిస్తారు. ఏమరపాటుగా ఉంటే ఏవో కతలు పడి ఏమార్చి మాయామశ్చీంద్ర చేస్తారు. ఆ దండయాత్రికులు మళ్లీ వస్తున్నారు. కండ్ల నీళ్లు రానమ్మ కొంగడ్డం పెట్టుకొని ఏడ్సినట్టుజేసిందని.. కొత్త నాటకం షురూ చేయడానికి వస్తున్నారు.
మోదీ వస్తున్నడు. మొన్న సర్కారును కూల్చే కుట్ర బయట పడి.. నిన్న మునుగోడులో ఓడి.. మళ్లీ తెలంగాణకు వస్తున్నాడు. అయిపోయిన పెండ్లికి బాజాలు కొట్టినట్టు.. రెండేండ్ల క్రితమే పునఃప్రారంభమై, ఉత్పత్తులను దేశమంతటా పంపుతున్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసే పేర మాయ చేయడానికి కాకపోతే.. ఎందుకు వస్తున్నాడు? సర్కారును కూల్చే కుట్ర బయట పడి కుట్రదారులు చంచల్ గూడ జైల్లో ఉండగానే ఆ విషయం మరిపించడానికి, ప్రజల దృష్టిని దాన్నుంచి మళ్లించడానికి మరో నాటకానికి తెరలేపడానికి కాదా?
తెలంగాణ.. ఇదొక స్వాభిమాన సంకేతం. నవకల్పనలతో ఉప్పొంగే జలపాతం. దశాబ్దాల పీడన తర్వాత స్వేచ్ఛను సాధించుకున్నది. ఉద్యమ స్ఫూర్తితో రాష్ర్టాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నది. దేశానికే మార్గదర్శకమైన తనదైన ఓ అందమైన ప్రపంచాన్ని రూపొందించుకుంటున్నది. నదుల నీళ్లు పొలాలకు మళ్లించుకుంటున్నది. ఎండిన చెరువుల్లో మత్తళ్లు దుంకించుకుంటున్నది. రాష్ట్రమంతా పచ్చనివనంలా మార్చుకుంటున్నది. గరీబులు సరీబులను ఆదుకుంటున్నది. దుబ్బకొట్టిన ఊళ్లను సక్కదిద్దుకుంటున్నది. ఈ అందమైన ప్రపంచాన్ని ఛిద్రం చేయడానికి కాకపోతే మోదీ రాక ఎందుకు? ‘ఈ అభివృద్ధిలో నీ పాత్ర ఏమిటి మోదీ? దేశ ప్రధానివి కదా? మా రాష్ర్టానికి ఏమిచ్చావు?’ అని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది.
మా రాష్ర్టానికి ఏం చేశావ్?
ఈ రోజు జాతి నిర్మాణంలో తెలంగాణ పాత్ర గొప్పది. దేశానికి నిధులిచ్చి సాకుతున్నది. మేము ఇచ్చింది 3,65,797 కోట్లు, మాకు వచ్చింది 1.68 లక్షల కోట్లు. ఇందులో మీ పాత్ర పైసా లేదు. ‘ఏమీ చేయకపోగా జరుగుతున్న అభివృద్ధిని చూసి కండ్లల్ల నిప్పులు పోసుకుంటున్నదీ, నిధులకు మోకాలడ్డిందీ వాస్తవం కాదా?’ అని తెలంగాణ సమాజం నిలదీస్తున్నది. రాష్ర్టానికి న్యాయంగా రావలిసిన ఎఫ్ఆర్బీఎంకు కోతలు పెట్టలేదా? యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు రుణాలు రాకుండా మాయ చేయలేదా? పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలను అడ్డుకున్నది వాస్తవం కాదా? చెప్పాలని డిమాండ్ చేస్తున్నది. సొంత దేశ అభివృద్ధికి ఇలా అడ్డంపడే ప్రధాని ప్రపంచంలోనే ఎక్కడైనా ఉంటాడా? గ్రోత్ ఇంజిన్గా తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే ఆ గ్రోత్నే నిలువరిస్తున్న కురుచబుద్ధి నేతలు ఏ దేశంలోనూ ఉండరని అంటున్నారు.
‘బర్రెపిల్లకు బనారస్ చీర’ అన్నట్టు ఇలాంటి నేతల వల్ల దేశానికి ఏం ఉపయోగం? ఎనిమిదేండ్లు గడిచినా నీటి కేటాయింపులు తేల్చకపోగా.. తెలంగాణ సాగునీటి రంగాన్ని దెబ్బ తీయడానికి రివర్బోర్డులు పెట్టి పెత్తనం చేస్తున్నది వాస్తవం కాదా? తెలంగాణ ఊరూరా కాంటాలు పెట్టి ధాన్యం కొనుగోలు చేస్తుంటే ఓర్చుకోలేక పార్బాయిల్డ్ పేరుతో కొనుగోళ్లకు గండి కొట్టాలని చూసి మా రైతులను గోస పెట్టలేదా? మోటర్లకు మీటర్లు పెట్టనందుకు ఎఫ్ఆర్బీఎంకు కోత పెట్టింది వాస్తవం కాదా? స్వచ్ఛ భారత్కు 19 తెలంగాణ గ్రామాలు ఎంపికైనా ఎక్కడా చెప్పలేదు. దేశంలో ఇంటింటికీ ముందుగా నీళ్లిచ్చింది తెలంగాణ అయితే, గోవాను పొగడుతారు. ముద్రా రుణాలు బీజేపీ రాష్ర్టాలకు ఎక్కువ ఇచ్చుకున్నారు. తెలంగాణకు మాత్రం 12శాతంలోనే సరిపెట్టారు. హైదరాబాద్ వరదలతో 5 వేల కోట్లు నష్టం వాటిల్లితే పైసా విదిల్చలేదు. కర్ణాటకకు నాలుగు రోజుల్లో సహాయం, గుజరాత్ అడగక ముందే 500 కోట్ల సాయం చేశారు. 2020 వరదల సమయంలో 16 రాష్ర్టాలకు నిధులిచ్చి తెలంగాణకు నయాపైసా ఇవ్వలేదు. ఉడాన్ పథకం కింద ఎన్నిసార్లు అడిగినా విమానాశ్రయాలను ఏర్పాటు చేయలేదు.
తెలంగాణ పుట్టుక నుంచే రాష్ట్రంపై విషం!
కాపురం చేసే కళ కాలు తొక్కినప్పుడే కనవడ్తదని..రాష్ట్రం ఏర్పాటునే చావూ బతుకూ అంటూ మోదీ విషం కక్కిన విషయాన్ని తెలంగాణ మరిచిపోలేదు. ‘రాష్ట్రం ఏర్పాటై ఎనిమిదేండ్లు దాటి నా విభజన చట్టం అమలు చేశావా? తెలంగాణకు రావలిసిన ఆస్తులు, సంస్థలు ఇప్పించావా? ఈ ప్రశ్నలకు నీ దగ్గర జవాబుందా? కొత్త రాష్ట్రం పుట్టకముందే ఏడు మండలాలు పక్కరాష్ర్టానికి అప్పగించిన నీ దౌష్ట్యాన్ని తెలంగాణ మరిచిపోతుందా? విద్యుత్ సమస్య ఉంటుందని తెలిసీ సీలేరు విద్యుత్ను క్రూరంగా లాక్కొని ఏపీకి ధారాదత్తం చేయడం తెలంగాణ మరిచిపోతుందా? పోనీ రాష్ట్రం ఏర్పాటయ్యాక నీ వైఖరి ఏమిటి? విభజన చట్టంలో ఉన్నా సరే.. ఒక్క సాగునీటి ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇచ్చిన దాఖలా ఉందా? బయ్యారం ఉక్కు ఏమైంది? కోచ్ ఫ్యాక్టరీ ఎవరెత్తుకు పోయారు? విద్యాసంస్థలేమైనయ్? ఐటీఐఆర్ ఏ కాకుల పాలైంది? ఎన్ని రకాలుగా దెబ్బతీశావు?’ అని తెలంగాణ అడుగుతున్నది. ‘ఏ దేశంలోనైనా ప్రధాని అభివృద్ధికి సహాయం చేస్తాడు. కానీ తన దేశంలో జరిగే అభివృద్ధికే మోకాలడ్డం పెట్టే ప్రధాని ఉన్నారా?’ అని ప్రశ్నిస్తున్నది.
టీవీల్లో ఓ బీజేపీ రాష్ట్రనేత బైట్ వస్తున్నది. ‘తెలంగాణలో ఇప్పుడే ఆట మొదలైంది. టీఆర్ఎస్కు మా సత్తా చూపిస్తాం’అంటున్నాడు. ‘నలుగురు నామీద ఊంచితే నేను చెర్ల ఊంచుతా’ అన్నడట వెనుకటికెవరో.. పబ్లిగ్గ దొంగతనం దొరికిపోయినా.. మునుగోడులో ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టినా వాళ్ల దబాయింపులు మాత్రం తగ్గడంలేదన్నది వాస్తవం.
నీతిఆయోగ్ చెప్పినా ఇవ్వనివెన్నో..
2016లో నీతిఆయోగ్ సభ్యులు తెలంగాణలో పర్యటించి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులను చూసి అబ్బురపడ్డారు. రాష్ట్రప్రభుత్వం సొంతంగా సుమారు రూ.60 వేల కోట్లకుపైగా వెచ్చించి ఈ పనులు చేపట్టడాన్ని ప్రశంసించారు. ఆ ఏడాది ఏప్రిల్ 12న హైదరాబాద్లో నీతిఆయోగ్ అధికారులతో జరిగిన చర్చల్లో.. రూ.20వేల కోట్లతో మిషన్ కాకతీయ చేపట్టామని, రూ.5 వేల కోట్ల సాయం అందించాలని రాష్ట్రం కోరింది. రూ.42 వేల కోట్ల వ్యయంతో చేపట్టిన మిషన్ భగీరథకు 19,205 కోట్లు సాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. సానుకూలంగా స్పందించిన నీతిఆయోగ్ రూ.24,205 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదించింది. ఈ మేరకు 2016 జూన్లోనే కేంద్ర ఆర్థికశాఖకు సిఫారసు చేసింది. ఆరేండ్లు దాటినా కేంద్రం ఇప్పటికీ రూపాయి కూడా విడుదల చేయలేదు. తెలంగాణ వినతులను, నీతి ఆయోగ్ సిఫారసులను పెడచెవిన పెట్టింది.
గుజరాత్కు 80వేల కోట్లు.. యాదాద్రి థర్మల్పై ఆంక్షలు
మోదీ దేశానికి ప్రధానిగా కాకుండా గుజరాత్కే సీఎంగా వ్యవహరిస్తున్నారు. 8 ఏండ్లలో 5 లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చారు. ఎన్నికల ఏడాది కావడంతో గత ఆర్నెళ్లలోనే ఏకంగా రూ.80 వేల కోట్ల ప్రాజెక్టులిచ్చారు. ఏప్రిల్ 20 నుంచి అక్టోబర్ 15 మధ్య వీటన్నింటికీ శంకుస్థాపన చేశారు. ఇదే ఆర్నెళ్లలో తెలంగాణకు అదనంగా రూపాయి కూడా విదల్చలేదు. యాదాద్రి థర్మల్ స్టేషన్కు రావాల్సిన రుణాన్నీ కేంద్రం ఆపింది. పైగా ప్రాజెక్టు నిర్మాణానికి మోకాలడ్డుతున్నది. అందుకు ఎన్జీటీని ముందుపెట్టి కథనడిపిస్తున్నది. ఎన్జీటీ అనుమతుల తర్వాతే నిర్మాణం ప్రారంభమవగా, ఇప్పుడు మరోసారి అధ్యయనం చేశాకే అనుమతలంటూ మెలిక పెట్టింది.
అప్పుపైనా ఆంక్షలే..
ఏ ప్రధాని అయినా తన దేశ ప్రగతిని కోరుకుంటారు. కానీ మోదీ దీనికి విరుద్ధం. కేంద్రం సహకరించకున్నా తెలంగాణ అప్పో సప్పో తెచ్చి అభివృద్ధికి ప్రయత్నాలు చేసుకున్నది. చివరకు దానినీ అడ్డుకునేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ‘అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నది. రాష్ర్టానికి న్యాయబద్ధంగా రావాల్సిన నిధులను విడుదల చేయకుండా అడ్డుకున్న మోదీ.. రాష్ట్రం సేకరించే రుణాలపైనా ఆంక్షలు విధించారు.
వద్దు మోదీ వద్దు!
తెలంగాణ రాష్ట్రం, దాని ఎదుగదల నచ్చని మోదీకి ఎందుకు స్వాగతం పలుకాలని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది. రాష్ట్ర పుట్టుకనే అవమానించిన ప్రధానికి హారతులెందుకు ఇవ్వాలని అడుగుతున్నది. ‘తెలంగాణ సంపదను, సంస్థలను దారిమళ్లించే నిన్ను ఎలా రమ్మనాలి. నా బతుకే నీకు ఉచితాలైనపుడు. నిన్నెందుకు గౌరవించాలి. నా ప్రగతికి మోకాలడ్డే.. నా ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేసిన నిన్ను ఏ రకంగా ఆహ్వానించాలి’ అని నిగ్గదీసి అడుగుతున్నది. ప్రభుత్వాలను కూల్చే కుతంత్రాన్ని పటాపంచలు చేసిన కేసీఆర్.. రాజకీయ దళారుల్ని, వారిని నడిపించే శక్తుల్ని బట్టలిప్పి బజార్ల నిలబెట్టిన నేపథ్యమిది. కాసేపూసే చెట్టును కొట్టాలనుకున్న పాపం కాశీకి పోయినా పోదు అంటారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి, ఏదో మసిపూసి మారేడుకాయ చేయడానికి కాకపోతే ప్రధాని రాకకు తగిన సందర్భమూ కనిపించడం లేదు. ‘వద్దు మోదీ రావొద్దు. తెలంగాణ తెరువుకు రావొద్దు’ అని కడుపుమండిన ప్రజలు స్పష్టంచేస్తున్నారు.
కొత్తరాష్ట్రం ఏర్పడినపుడు
దేశంలో ఏదైనా ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటైనపుడు కేంద్రం తల్లిపాత్ర తీసుకొని శిశువును సాకినట్టు సాకాలి. ఆ రాష్ట్రం ఆర్థికంగా, పాలనాపరంగా నిలదొక్కుకునేందుకు చేయూతనివ్వాలి. తల్లి రాష్ట్రంతో వివాదాలను పెద్దన్న పాత్ర తీసుకుని పరిష్కరించాలి..మోదీ స్వరాష్ట్రం గుజరాత్ బొంబాయి రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు కేంద్రం ఈ రకమైన చేయూత నిచ్చింది. ఈశాన్య రాష్ర్టాల విషయంలోనైతే కేంద్రం దశాబ్దాలపాటు ఆ రాష్ర్టాల ఆర్థిక భారాన్ని మోసింది. ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చింది. ఉచితంగా విద్యుత్తు కూడా ఇచ్చింది. సిక్కిం విషయంలోనూ సహకారం ఇచ్చింది. బీజేపీ ఆధ్వర్యంలో 3 రాష్ర్టాలు ఏర్పాటైనపుడూ ఆ రాష్ర్టాలకు చేయూత నిచ్చింది. ఛత్తీస్గఢ్ రాజధాని నిర్మాణానికి నిధులిచ్చింది. పంజాబ్, హర్యానాలకు ఉమ్మడి రాజధాని అయిన చండీగఢ్ను కేంద్రమే నిర్మించి ఇచ్చింది. నెహ్రూనుంచి వాజపేయి వరకు ప్రధానులంతా ఈ పద్ధతి అనుసరించారు. మరి మోదీ కొత్తరాష్ట్రం గొంతు ఎందుకు నులమాలని చూస్తున్నారని తెలంగాణ నిలేస్తున్నది.
తెలంగాణ మీద ఎందుకు కన్ను?
ఇవాళ బీజేపీ కన్ను తెలంగాణ మీద కేంద్రీకృతమైంది. దక్షిణాదిలో ఇంకా అనేక రాష్ర్టాలున్నాయి. పక్కనే ఏపీ ఉంది. తమిళనాడు ఉంది. అయినా బీజేపీ హాట్ ఫెవరేట్ తెలంగాణయే. ఎందుకంటే తెలంగాణ సుసంపన్న రాష్ట్రం.దేశాన్ని సాకేంత ఆదాయం ఉంది. దేశానికి తినిపించేంత ఆహారం ఉన్నది. రాజధాని హైదరాబాద్ బంగారు తునక. లక్షల కోట్ల ఐటీ రంగం. దేశంలోకెల్లా అతి పెద్ద పార్మారంగం. వేలకోట్ల వ్యాపారానికి ఆలవాలమైన రియల్ ఎస్టేట్ రంగం, కోటిన్నర జనాభాతో అతిపెద్ద వినియోగదారుల నగరం, వైద్యసేవల్లో అగ్రగామి. లక్షల మందికి ఉపాధి కల్పించగల రిటైల్ రంగం, దాన్ని తలదన్నే సేవారంగం. అతి వేగంగా విస్తరిస్తున్న నగరం. దేశంలోని మిగిలిన నగరాలు తిరోగమనంలో ఉన్నాయి. ఢిల్లీ కాలుష్యంతో సతమతమవుతున్నది. కోల్కతా జనాభా పెరిగి ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ముంబై ఇక విస్తరణకు అవకాశం లేనిదైంది. బెంగళూరు పూర్వవైభవం కోల్పోయింది. చెన్నై చిన్నవానలకే ఛిన్నాభిన్నమై పోతున్నది. చారిత్రక హైదరాబాద్ ప్రభ ప్రపంచ వ్యాప్తమవుతున్నది.
ప్రపంచ ప్రసిద్ధ సంస్థలన్నీ హైదరాబాద్ను డెస్టినేషన్గా ఎంచుకుంటున్నాయి. ఇక్కడ సహజ సంపద సింగరేణి ఉంది. బంగారం పండే భూములున్నాయి. రెండు జీవనదులున్నాయి. కష్టించి పనిచేసే ప్రజలున్నారు. దేశంలోనే అత్యధిక ధాన్యం ఉత్పత్తి జరుగుతున్నది. అందుకే ఈ సంపద మీద బీజేపీ, దాన్ని నడిపించే వ్యాపారవర్గాల కండ్లు పడ్డాయి. ఏదో రకంగా ఈ రాష్ర్టాన్ని వశపరుచుకుంటే గజనీ సోమనాథ్ను దోచినట్టు దోచుకోవచ్చనేది వారి ఆలోచన. సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ సంస్థలను తమ వ్యాపార మిత్రులకు కట్టబెట్టవచ్చనే ఎత్తుగడ. హైదరాబాద్ వ్యాపారాలను, తెలంగాణ భూములను కార్పొరేట్ గద్దల పాలు చేయవచ్చని ఆలోచన. కేంద్రం స్వయంగా దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను అడ్డికిపావుశేరు ఈ వ్యాపారవర్గాలకు అమ్ముతున్న వైనం చెప్తున్నది ఇదే. వీళ్ల చేతికి బంగారు తెలంగాణ దొరికితే గరకపోస కూడా మిగలదు. ఓ తీర్గ కాకుంటే ఇంకో తీర్గ తెలంగాణ మీద దాడులు చేస్తునే ఉంటరు. వాళ్ల దొంగతనాలు అడ్డంగా దొరికినా, కుట్రలు బట్టబయలైనా.. దాడులు చేస్తరు. పర్యటనలూ చేస్తరు. చేస్తూనే ఉంటారు. అప్రమత్తంగా ఉండాల్సింది ప్రజలే!
1. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో 10వ అంశం కింద స్పష్టంగా పేర్కొన్నారు. మహారాష్ట్రకు ఇచ్చి తెలంగాణకు కేంద్రం మొండిచెయ్యి చూపించింది.
2. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ
బయ్యారంలో ‘సెయిల్’ ఆధ్వర్యంలో రూ.36వేల కోట్లతో ఉక్కుఫ్యాక్టరీ నిర్మిస్తామని విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో పేర్కొన్నారు. నిర్మాణానికి చర్యలు తీసుకోకపోగా.. దీనిపై నెపం వేసేందుకు కుట్ర చేస్తున్నది.
3. గిరిజన విశ్వవిద్యాలయం
తెలంగాణలో దాదాపు 12% జనాభా గిరిజనులు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రత్యేకంగా గిరిజన వర్సిటీని ఏర్పాటు చేస్తామని విభజనచట్టంలో కేంద్రం స్పష్టంగా పేర్కొన్నది. కేంద్రం పట్టించుకోలేదు. కానీ.. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఏపీకి మాత్రం గిరిజన వర్సిటీని మంజూరు చేసింది.
4. ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా
ఏపీలోని పోలవరానికి జాతీయహోదా ఇచ్చిన నేపథ్యంలో.. తెలంగాణలోనూ ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కేంద్రం విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నది. కాళేశ్వరం లేదా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సహా అనేకమంది మంత్రులు, ఎంపీలు ప్రధాని మోదీకి, కేంద్రానికి పలుమార్లు విన్నవించారు. 2018 ఆగస్టులో అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ‘ఇకపై ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇచ్చేది లేదు’ అని ప్రకటించారు. కానీ ఆ తర్వాత కర్ణాటక, మధ్యప్రదేశ్ ప్రాజెక్టులకు జాతీయహోదా ఇచ్చి.. తెలంగాణకు ధోకా ఇచ్చారు.
5. షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన
రాష్ట్ర విభజన సమయంలో షెడ్యూల్ 9, 10 లో చేర్చిన ఉమ్మడి ఆస్తుల విభజన ఏడేండ్లవుతున్నా.. ఇప్పటికీ కొలిక్కి రాలేదు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం.. తెలంగాణ, ఏపీ మధ్య చిచ్చు పెట్టి చోద్యం చూస్తున్నది.
తెలంగాణ సంస్థలు.. వేరే రాష్ర్టాలకు!
న్యాయబద్ధంగా రావాల్సి ఉన్నా ఇవ్వనివి..
1. జిల్లాకో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాలి. ఇవ్వలేదు.
2. తెలంగాణకు ఒక్క కొత్త వైద్యకళాశాలను కూడా ఇవ్వలేదు.
3. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయలేదు.
4. హైదరాబాద్కు మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసింది.
5. ఐఐఎం వంటి కేంద్ర విద్యాసంస్థల్లో ఒక్కటి కూడా రాష్ర్టానికి మంజూరు చేయలేదు.
6. హైదరాబాద్కు వరద సాయంపై ఉలుకూపలుకూ లేదు.
7. తెలంగాణకు రావాల్సిన డిఫెన్స్ కారిడార్ ఏర్పాటును కేంద్రం పక్కనబెట్టింది.