రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): నరేంద్రమోదీ అసమర్థ ప్రధాని అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. నాడు ప్రధాని మన్మోహన్ కాలంలో రూపాయి విలువ పడిపోయిందంటూ గగ్గోలు పెట్టిన మోదీ పాలనలో రూపాయి విలువ అంతకు మించి పడిపోయిందని.. దీనిని బట్టి ఎవరు అసమర్థ ప్రధాని? అని ప్రశ్నించారు. మోదీ పాలనలో అందరి బతుకులు ఆగమవుతున్నాయని మండిపడ్డారు. పేదలను కడుపులో పెట్టుకొని దాచుకునే నాయకుడు కేసీఆర్ కావాలా? అందరి బతుకులను ఆగం చేసే మోదీ కావాలా? ఆలోచించాలని కోరారు.
మతం, కులం పేరుతో అడ్డమైన పంచాయతీలు పెడుతూ, రాజకీయ చలి మంటల్లో ఓట్లు దండుకోవాలని చూసేవారిని ఓ కంట కనిపెట్టాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఎల్లారెడ్డిపేటలో ఏర్పాటుచేసిన సభలో గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న రెండు వేల మంది విద్యార్థులకు రూ.86 వేల విలువైన (ఆకాశ్, బైజూస్ సాఫ్ట్వేర్ మెటీరియల్తో కలిపి) ట్యాబ్లను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం వృద్ధుల కోసం డే కేర్ సెంటర్తోపాటు బొప్పాపూర్, రాగట్లపల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో కొత్తగా నిర్మించిన పంచాయతీ భవనాలను ప్రారంభించారు. సిరిసిల్ల కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో 400 మంది పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఓ పిచ్చోడు ప్రగతిభవన్ను కూలగొడుతానంటడు. ఇంకో పిచ్చోడు సెక్రటేరియట్ను కూలగొడుతానంటడు. వీళ్లకు కూలగొట్టుడు తప్ప కట్టుడు తెలియదు. మనం కట్టే పనిచేస్తుంటే వాడు కూలగొట్టే పనిచేస్తుండు’ అని మండిపడ్డారు.
ఎల్లారెడ్డిపేటలో విద్యార్థులతో కలిసి ట్యాబ్ను పరిశీలిస్తున్న మంత్రి కేటీఆర్
సామాన్యులకు మంచి చేయని మోదీ
నల్లధనం తెస్తానన్న ప్రధాని మోదీ తెల్ల ముఖం వేశారని మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు. ‘ప్రధాని మోదీ చెప్పినట్టుగా ఎవరి ఖాతాలోనైనా రూ.15 లక్షల పడ్డయా? రైతుల ఆదాయం డబుల్ అయ్యిందా?’ అని ప్రశ్నించారు. ఎవరి ఆదాయం డబుల్ అయ్యిందని కేటీఆర్ ప్రశ్నించడంతో అదానీ, అంబానీ.. అంటూ ప్రజలు ముక్తకంఠంతో జవాబిచ్చారు. బుల్లెట్ రైళ్లు, స్మార్ట్ సిటీలు ఏమయ్యాయని నిలదీశారు. ప్రధాని మోదీ సామాన్యుడి కోసం ఏ ఒక్క మంచి పనీ చెయ్యలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు స్వామీజీలను పంపి ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రలను దేశమంతా చూసిందని ఎద్దేవా చేశారు.
తాము చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పమంటే పాకిస్థాన్, బంగ్లాదేశ్ అంటరు తప్ప వారి నోటి నుంచి మంచి మాటలు రావని చురకలేశారు. ‘శవం ఎల్తే మీది, శివం వస్తే మాది.. మసీదులు తవ్వుతాం’ అంటూ మత ఘర్షణలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ బండి సంజయ్పై మండిపడ్డారు. ఎంపీగా కరీంనగర్, సిరిసిల్లకు బుడ్డ పైసా తీసుకురాలేదని ధ్వజమెత్తారు. పన్నుల రూపంలో రాష్ట్రం కేంద్రానికి రూ.3.70 లక్షల కోట్లు కడితే తిరిగి ఇచ్చింది రూ.లక్షా 68 వేల కోట్లేనని వివరించారు. తెలంగాణ సొమ్మును బీజేపీ పాలిత రాష్ర్టాలకు ఖర్చుచేస్తున్నారని, ఇది అవాస్తవమని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని పునరుద్ఘాటించారు. నిరూపించే దమ్ము బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఉన్నదా? అని సవాల్ చేశారు. మోదీ రాష్ర్టానికి ఏం చేశాడని ఆయన దేవుడని ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమంలో చేపట్టిన పనుల వివరాలు ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్లో తాను ఫ్లెక్సీలు ఏర్పాటు చేయిస్తానని, బీజేపీ ఎంపీగా బండి సంజయ్ చేసిన వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కార్పొరేట్కు దీటుగా సర్కారు బడులు
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. చిన్నారి తమ్ముళ్లు, చెల్లెళ్ల ముఖంలో చిరునవ్వులు చూడాలన్న ఉద్దేశంతో గిఫ్ ్టఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఆకాశ్, బైజూస్ సాఫ్ట్వేర్ ట్యాబ్లను సర్కారు బడుల్లో చదువుతున్న 2,000 మందికి ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపారు. ఈ ట్యాబ్లను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. రాబోయే మూడు నెలలు బాగా కష్టపడి చదివి ర్యాంకు సాధించి తల్లిదండ్రులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఉద్బోధించారు. గతంలో సిరిసిల్ల విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చామని, త్వరలో వేములవాడ నియోజకవర్గ విద్యార్థులకు కూడా ట్యాబ్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ అనురాగ్ జయంతి, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ తదితరులు పాల్గొన్నారు.
అంజన్న లేని ఊరు లేదు.. ప్రభుత్వ సంక్షేమం అందని ఇల్లు లేదు.. పేదలను కడుపులో పెట్టుకొని దాచుకునే నాయకుడు కేసీఆర్ కావాలా? అందరి బతుకులను ఆగం చేసే మోదీ కావాలా? ఆలోచించాలి
– మంత్రి కేటీఆర్
సిరిసిల్లకు కేటీఆర్ అభినందనలు
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ ర్యాంకింగ్స్లో ఫోర్ స్టార్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగాన్ని మంత్రి కేటీఆర్ అభినందించారు. కలెక్టర్ నేతృత్వంలోని సిరిసిల్ల జిల్లా బృందానికి అభినందనలు అంటూ ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. ఈ ర్యాంకు సాధించడానికి కృషి చేసిన సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవోలు, జిల్లా అధికారులకు అభినందనలు తెలిపారు.