హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తేతెలంగాణ): ‘పుష్కలంగా నీటి వనరులున్న దేశం మనది. సాగు యోగ్యమైన భూమి అందుబాటులో ఉన్నది. రైతులకు అండగా ఉంటూ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన కేంద్రం.. ఆ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నది. రైతు చట్టాలు తెచ్చి 750 మంది రైతులను పొట్టనపెట్టుకొన్నది. రైతు బాంధవుడైన కేసీఆర్ నాయకత్వం ఇప్పుడు దేశానికి ఎంతో అవసరం. రైతు బాధలు తెలిసిన రైతుబిడ్డ కేసీఆర్ దేశ ప్రధానిగా ఉండాలని జాతీయస్థాయిలో రైతు సంఘాల నాయకుల ఆకాంక్ష. రైతు పక్షపాతిగా ఉండే పార్టీ జాతీయస్థాయిలో వస్తే మంచి మనసుతో ఆహ్వానిస్తాం’ అని భారతీయ కిసాన్ యూనియన్ ఢిల్లీ అధ్యక్షుడు వీరేందర్సింగ్, ప్రధాన కార్యదర్శి దల్జీత్సింగ్ దాగర్ చెప్పారు. ప్రధాని మోదీ వ్యవసాయ వ్యతిరేక విధానాలు, కేసీఆర్ జాతీయ పార్టీ టీఆర్ఎస్ (బీఆర్ఎస్)పై వారు టీన్యూస్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వివరించారు.
రైతుల విషయంలో కేంద్రం విధానాలు ఎలా ఉన్నాయి?
వీరేందర్సింగ్: రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో 750 మంది అమరులయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా వచ్చి రైతు అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయమిచ్చి భరోసా ఇచ్చారు. తెలంగాణలో సాగుకు ఉచితంగా కరెంటు ఇస్తున్నారు. సరిపడా సాగు నీళ్లు ఇస్తున్నారు. కేసీఆర్కు దేశ రైతుల తరఫున మేం అండగా ఉంటాం.
కనీస మద్దతు ధరపై కేంద్రం వైఖరి?
వీరేందర్సింగ్: మేం చేసిన భారీ ఆందోళన తర్వాత కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి సంబంధించి ప్రత్యేక చట్టం చేస్తామని ప్రధాని మోదీ రాతపూర్వక హామీఇచ్చారు. ఈ చట్ట రూపకల్పనలో ఉన్నవారంతా రైతు ద్రోహులే. వారిపై మాకు నమ్మకం లేదు. ఢిల్లీలో రైతులకు గౌరవం లేదు. ఎంఎస్పీపై చట్టం వచ్చే వరకు ఆందోళన కొనసాగుతుంది.
మోటర్లకు మీటర్లు పెట్టాలనడంపై ఏం అంటారు?
దల్జీత్సింగ్: కేంద్ర ప్రభుత్వం రైతులను ఆకలిచావుల పాల్జేయాలని చూస్తున్నది. నూతన విద్యుత్తు సవరణ బిల్లు ఆమోదమైతే కరెంటు వ్యవస్థ ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళుతుంది. ఇప్పటికే దేశంలో సాగు భారంగా మారింది. విద్యుత్తు సవరణ బిల్లు వస్తే వ్యవసాయాన్ని వదిలేయక తప్పదు. కొన్ని రాష్ర్టాల్లో రైతులు కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితి. భవిష్యత్తులో కరెంటు చోరీ చేస్తే కానీ పొలాలకు సరిపడా నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉంటుంది.
తెలంగాణలో రైతుబంధుపై మీ అభిప్రాయం ?
వీరేందర్సింగ్: రైతులకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. సీఎం కేసీఆర్ చండీగఢ్కు వచ్చినప్పుడు మేమంతా ఆయనతో మాట్లాడాం. ఎకరానికి పెట్టుబడి సాయం రూ.10వేలు ఇస్తుండటం చాలా పెద్ద మద్దతు. సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. మా దగ్గర (ఢిల్లీలో) సర్కార్ నుంచి ఎలాంటి సాయం అందదు.
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది ?
వీరేందర్సింగ్: రైతులు పండించే పంటంతా ప్రభుత్వం కొనడం లేదు. ఢిల్లీలో ఉన్న నజఫ్గఢ్, నరేలా మార్కెట్లో కేవలం గోధుమలు, ఆవాలు మాత్రమే కొంటున్నారు. మిగిలిన జొన్న, ఇతర పంటలకు ఆ సదుపాయం లేదు. రైతులను ప్రధాని మోసం చేశారు. చప్పట్లు కొట్టండి..కొవ్వొత్తులు వెలిగించండి అని చెబితే కడుపు నిండుతుందా ? మేం తెలంగాణ రైతులతో మాట్లాడాం. వాళ్లు ఎంతో సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి దేశ రాజకీయాల్లోకి వస్తున్నారంటే ఎంతో సంతోషం.
రైతుబంధు, రైతుబీమా, సాగుకు ఉచిత విద్యుత్తు లాంటివి మీరు కోరుకుంటున్నారా ?
దల్జీత్సింగ్: సాగుకు కరెంటు ఉచితంగా ఇచ్చి, పెట్టుబడి సాయం అందిస్తే పంటల సాగు పెరుగుతుంది. తద్వారా రైతులు ఆర్థికంగా లాభపడుతారు. దేశంలో ఇంకా 20 కోట్ల మంది దారిద్య్రరేఖకు దిగువ ఉన్నారు. బీజేపీ సర్కార్ ఉల్టా పనులు చేస్తున్నది. మోదీ సర్కార్ రైతుల భూములు లాక్కోవాలని కుట్రలు చేస్తుంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్ రైతులకు మద్దతుగా నిలుస్తున్నారు.
దేశంలో కొత్త పార్టీ రావాల్సిన ఆవశ్యకత ఉందంటారా ?
దల్జీత్సింగ్: దేశంలో కొత్త పార్టీ అవసరం. బీజేపీని ఢీకొనడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. తెలంగాణలో రైతుల కోసం కేసీఆర్ ఏం చేశారో నిరూపించారు. దేశం మొత్తం ఇదే కావాలి. రైతు వ్యతిరేక, అవినీతి బీజేపీ ప్రభుత్వానికి కేసీఆర్ లాంటి నేత చరమగీతం పాడాలి.
టీఆర్ఎస్ (బీఆర్ఎస్)పై మీ అభిప్రాయం?
వీరేందర్సింగ్: రైతు ఉద్యమంలో 750 మంది చనిపోయారు. వారి తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు అనాథలై కష్టాల్లో ఉన్నారు. అలాంటి సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వారికి అండగా నిలబడ్డారు. ఆ రైతు కుటుంబాల తరఫున కేసీఆర్కు ఆశీర్వాదాలు అందజేస్తున్నాం. కేసీఆర్ పార్టీ వెంట దేశ రైతులంతా ఉంటారు.