హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన, పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ నిలిపిన అభ్యర్థులను చూస్తుంటే మోదీ బడే భాయ్..రేవంత్ రెడ్డి ఛోటే భాయ్ అనడంలో ఎటువంటి సందేహం లేదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Former MLA Balka Suman) విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అభ్యర్థులంతా డమ్మీ అభ్యర్థులే (Dummy Candidates) నని, బీజేపీకి లాభం చేకూర్చేందుకే వారిని బరిలో నిలిపినట్లు స్పష్టమవుతున్నదని ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
కిషన్ రెడ్డి(Kishan Reddy), రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇద్దరు అన్నదమ్ములుగా వ్యవహరిస్తున్నారని, కిషన్ రెడ్డి గెలుపు కోసమే దానం నాగేందర్ను నిలిపారని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నది ప్రజా పాలన కాదని, నయవంచన పాలన అని, తెలంగాణ సంపదను ఢిల్లీకి చేరవస్తున్నారని ధ్వజమెత్తారు.
మొన్నటి వరకు బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని ప్రచారం చేశారని, ఇవ్వాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చూస్తుంటే కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని స్పష్టమవుతున్నదన్నారు. ఈ రెండు పార్టీల కంటే బీఆర్ఎస్ పార్టీనే బలమైన పార్టీ అని పేర్కొన్నారు.
తుక్కుగూడలో ఇటీవల జరిగిన కాంగ్రెస్ సభలో రాహూల్ గాంధీ నోటి చేత పచ్చి అబద్ధాలు మాట్లాడించారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చాక ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని, బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలను తామిచ్చినట్లుగా డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ పేరిట మొదటి ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్ని పేపర్లలో ప్రకటనలు ఇచ్చి, ఇప్పుడు తాము ఇచ్చిన 30వేల ఉద్యోగాలను వారిచ్చినట్లు ప్రకటనలు ఇచ్చుకుంటున్నారన్నారు. టెట్ పరీక్ష ఫీజును వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
పచ్చి అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు రాబోయే పార్లమెంట్(Parliament) ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. రూ. 25 వేల కోట్లు ప్రభుత్వ ఖజానాలో ఉన్నట్లు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే చెప్పారని గుర్తుచేస్తూ, ఆ డబ్బు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి కాంట్రాక్టు సంస్థల ఖాతాలకు వెళ్లిందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరుగుతున్నదో రేవంత్ రెడ్డి మీడియాకు చెప్పకుండా ప్రతి రోజు ఏదో ఒక లీక్లు ఇస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు.