Southwest Monsoon | హైదరాబాద్, జూన్ 22(నమస్తే తెలంగాణ): రాష్ట్రం లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
15రోజులుగా అనుకూల పరిస్థితులు లేకపోవడంతో భదాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ వరకు విస్తరించి ఆగిపోయిన రుతుపవనాల్లో కదలిక వచ్చినట్టు పేర్కొన్నది. సోమవారం నిజామాబాద్ వరకు విస్తరించగా, మంగళవారం రాష్ట్రమంతటా విస్తరిస్తాయని తెలిపింది. రుతుపవనాల విస్తరణతో వచ్చే ఐదు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షాలతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు దాదాపు ఐదు డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. సోమవారం అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసినట్టు తెలిపింది. మంగళ, బుధవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.