Monsoon | హైదరాబాద్, మే 31 (నమస్తేతెలంగాణ): తెలంగాణలో వచ్చే మూడు రోజులు అక్కడక్కడ తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. జూన్ రెండో వారంలో నైరుతి రుతుపవనాలు వస్తాయని పేర్కొన్నది. చిరుజల్లులను చూసి తొందరపడి రైతులు విత్తనాలు విత్తుకోవద్దని సూచించింది. వచ్చే 3 రోజులు పగటి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నదని, హైదరాబాద్, చుట్టూ పక్కల జిల్లాల్లో 38 డిగ్రీల నుంచి 41 వరకు నమోదయ్యే అవకాశం ఉన్నదని తెలిపింది. రుతుపవనాలు ప్రవేశించడంతో ఎండలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు తెలిపింది. బుధవారం పలు జిల్లాల్లో పగటి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. నల్లగొండలో 41.5, నిజామాబాద్ 40.9, భద్రాచలం, మెదక్ జిల్లాల్లో 40.8 చొప్పున, ఆదిలాబాద్లో 40.3, హైదరాబాద్లో 38.9 డిగ్రీలు నమోదైంది.