హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబరు 3 (నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్వేవ్ దెబ్బనుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న హైదరాబాద్పై ఒమిక్రాన్ నీడలు కమ్ముకొంటున్నాయి. విదేశాల నుంచి బుధ, గురువారాలలో నగరానికి వచ్చినవారిలో 13 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఒమిక్రాన్ ప్రభావిత దేశాలైన దక్షిణాఫ్రికా, కెనడా, సింగపూర్, బ్రిటన్, అమెరికా తదితర 12 దేశాల నుంచి వచ్చిన 909 మంది మందికి శంషాబాద్ ఎయిర్పోర్టులో పరీక్షలు చేయగా, వారిలో 13 మందికి వైరస్ సోకినట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. వీరిని టిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
తమ వద్ద చికిత్స పొందుతున్న 13 మందిలో ఎటువంటి లక్షణాలు లేవని టిమ్స్ వైద్యురాలు డాక్టర్ విమలా థామస్ చెప్పారు. అయితే వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్స్ పరీక్షల కోసం సీడీఎఫ్సీకి పంపించామని తెలిపారు. ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన పాజిటివ్ రోగుల కోసం టిమ్స్లో 3వ, 4వ అంతస్తుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశామని చెప్పారు. టిమ్స్లో మొత్తం 200 పడకలను కరోనా రోగులకోసం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వాటిలో విదేశాల నుంచి వచ్చిన వారికోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశామని చెప్పారు. రోగుల సంఖ్య పెరిగితే అందుకనుగుణంగా వార్డులు, పడకల సంఖ్యను పెంచుతామని అన్నారు.
జీడిమెట్ల: లండన్ నుంచి వచ్చి కరోనా నిర్ధారణ అయిన ఓ యువతి దవాఖానకు వెళ్లకుండా తప్పించుకొనేందుకు ప్రయత్నించింది. అయితే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసులు ఆమెను గచ్చిబౌలిలోని టిమ్స్కు తరలించారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ గణేశ్నగర్ సమీపంలోని రిడ్జ్ టవర్స్కు చెందిన ఓ యువతి (36) లండన్ నుంచి గురువారం సాయంత్రం వచ్చింది. ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. అధికారులు ఆమెను దవాఖానకు తరలించే క్రమంలో తప్పించుకొని తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. ఎయిర్పోర్టు అధికారులు ఆ యువతి పాస్పోర్టు ఆధారంగా చిరునామాను గుర్తించి జీడిమెట్ల ఇన్స్పెక్టర్ బాలరాజుకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన వైద్యారోగ్యశాఖ అధికారులు, పోలీసులు రిడ్జ్ టవర్స్కు చేరుకుని అసోసియేషన్ నాయకులు, స్థానికుల సహకారంతో ఆ యువతిని టిమ్స్కు తరలించారు. ఆ యువతి కుటుంబసభ్యులను ఐసొలేషన్లో ఉంచారు.