హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : ఒకటో తేదీనే ఉద్యోగుల వేతనాలేశాం. పెన్షన్లను రిటైర్డ్ ఉద్యోగుల ఖాతాల్లో జమచేశాం. ఇది సీఎం నుంచి మొదలుకొంటే మంత్రుల వరకు ప్రభుత్వవర్గాల ప్రకటన. కానీ ఈ హామీ.. ప్రకటనలు పూర్తిస్థాయిలో అమలుకావడం లేదని క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టంచేస్తున్నాయి. ప్రభుత్వ హామీలు ఎండమావిని తలపిస్తున్నాయి. రాష్ట్రంలోని మాడల్ స్కూల్ టీచర్లకు ఇప్పటివరకు వేతనాలందలేదు. ఒకటో తేదీ గడిచిపోయి 11 రోజులవుతుంది. అయినా వీటిల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకు వేతనాలు అందలేదు. దీంతో టీచర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న అవర్లీ బేస్డ్ టీచర్లది అదే పరిస్థితి. వీరికి రెండు నెలల వేతనాలు అందలేదు.
వేతన వెతలు
రాష్ట్రంలో 194 మాడల్ స్కూళ్లున్నాయి. వీటిల్లో 5,500 మంది రెగ్యులర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో ప్రిన్సిపాళ్లు, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు, ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్లున్నారు. వీరికి ఇంతవరకు వేతనాలు రాలేదు. రాష్ట్రంలోని రెగ్యులర్ ఉద్యోగులందరికీ 1వ తేదీనే వేతనాలిచ్చామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ వీరికి వేతనాలు ఇంతవరకు రాకపోవడం గమనార్హం. దీనిపై అధికారులను ఆరా తీయగా, బడ్జెట్లేని కారణంగా వేతనాలివ్వలేదని చెబుతున్నారు. వేతనాలకు సంబంధించిన నిధులు ఆర్థికశాఖ విడుదల చేయకపోవడంతో వేతనాలు అందని పరిస్థితి నెలకొన్నది. ఇదే పాఠశాలలో పనిచేస్తున్న 1200 మంది అవర్లీ బేస్డ్ టీచర్లకు జనవరి, ఫిబ్రవరి రెండు నెలల వేతనం కూడా ఇప్పటివరకు అందలేదు. దీనితో మాడల్ సూల్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంక్ ఈఎంఐలు చెల్లింపు సరిగా చేయలేకపోవడంతో చెక్బౌన్స్ అయి సిబిల్ సోర్ దెబ్బతింటుందని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
అప్పులు చేయాల్సిన పరిస్థితి
రెగ్యులర్ ఉపాధ్యాయులమైనప్పటికీ ఇప్పటివరకు మాకు వేతనాలు అందలేదు. ఈ ప్రభుత్వం 1వ తేదీన వేతనాలిస్తదని ఆశించాం. కానీ ఇంతవరకు వేతనాలు అందకపోవడంతో ఈఎంఐ ఇతర ఇంటి అవసరాలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉపాధ్యాయుల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల వేతనాలు వెంటనే చెల్లించాలి. ప్రతి నెల 1వ తేదీన వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.
– భూతం యాకమల్లు, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్టీఏ)