నందికొండ, జనవరి 11 : నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రధాన డ్యామ్పై ఉగ్రవాదులు దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఆక్టోపస్ దళాలు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఆక్టోపస్ దళాలు గ్రూపులుగా విడిపోయి ఒక వర్గం ఉగ్రవాదులుగా దాడులు చేస్తుంటే.. మరో వర్గం వారిని ఎదుర్కొంటూ మట్టుబెట్టే విధంగా డ్రిల్ చేశాయి. డాగ్స్కాడ్, రబ్బర్ బుల్లెట్స్, డిటోనేటర్లను ఉపయోగించి వాస్తవ పరిస్థితులకు ఏమాత్రమూ తీసిపోకుండా ఈ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రవాదులు డ్యామ్పై దాడులు చేస్తే ఎలా ఎదుర్కోవాలి? దాడిలో గాయపడిన వారిని ఏవిధంగా అంబులెన్స్లో తీసుకుపోవాలి? ఉగ్రవాదుల చెరలో ఉన్న వారిని ఎలా రక్షించాలి? స్థానిక పోలీస్ బలగాలను ఏవిధంగా ఉపయోగించాలి? అనే అంశాలపై ఆక్టోపస్ అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ డ్రిల్లో ఆక్టోపస్, ఎస్పీఎఫ్, స్థానిక పోలీస్, వైద్య, ఫైర్ విభాగాలు పాల్గొన్నాయి.