హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఇద్దరు కుమారులు కాళ భైరవ, శ్రీ సింహ పాల్గొన్నారు. రామానాయుడు స్టూడియో ఆవరణలో వీరిద్దరూ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా నటుడు శ్రీ సింహ, మ్యూజిక్ డైరెక్టర్ కాళ భైరవ మాట్లాడుతూ.. సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం గొప్ప విషయమన్నారు. మొక్కలు నాటడంతో మంచి పర్యావరణం ఏర్పడుతుందన్నారు. స్వచ్ఛమైన గాలి కూడా లభిస్తుందన్నారు. రెజినా ఇచ్చిన ఛాలెంజ్ని స్వీకరించి మేము మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమంలో మాకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. మొక్కలు నాటడం వాటి సంరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న ఎంపీ సంతోష్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు.