హైదరాబాద్ : స్వాతంత్య్ర పోరాటంలో మహిళలు చూపిన పోరాట ప్రతిమను పరిశోధనా విద్యార్థులు వెలికి తీయాలని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి (MLC Vanidevi) అన్నారు. ‘స్వాతంత్య్ర పోరాటంలో గుర్తింపునకు నోచుకోని వారిని అన్వేషించడం-సమకాలీన ఔచిత్యం’ అనే అంశంపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో రెండు రోజుల సెమినార్ (Seminor) ను ఎమ్మెల్సీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూనివర్సిటీలలో జరిగే పరిశోధనలు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. స్వాతంత్య్ర దేశ ఉద్యమంలో మహిళల (Womens Role) పాత్ర, వారి పోరాట విధానంపై పరిశోధనలు (Research) పెంచాలన్నారు. ఆ ఉద్యమాల ఘట్టాలను నేటి విద్యార్థులకు అనుభూతి కల్గించే విధంగా ఉండాలన్నారు. స్వాతంత్య్ర పోరాట యోదుల్లో స్వామి రామానంద తీర్థ ఒకరని వివరించారు.
గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ అయాచిత శ్రీధర్ మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాట గాధలను విదేశీయులు రాస్తేనే తెలిసే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వాటిని పాఠ్యపుస్తకాల్లో చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ సీతారామారావు మాట్లాడుతూ భారత దేశ చరిత్ర, సంస్కృతిని, పోరాట యోధుల యుద్ధగాధలు వెలికి తీసేలా యూనివర్సిటీలలో పరిశోధనలు కొనసాగాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జి రామిరెడ్డి, సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుధారాణి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఏవీఆర్ఎన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఆర్కీవ్స్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ జరీనా పర్వీన్, తెలంగాణ చారిత్రక విభాగ కౌన్సెల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ టీ వివేక్, పాల్గొన్నారు.