హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తేతెలంగాణ): ‘ప్రస్తుత విద్యావ్యవస్థ బాగు గురించి సిఫార్సు చేయాల్సిన విద్యా కమిషన్ టీచర్ల వేతనాల గురించి ప్రస్తావించడం ఎందుకు? సంబంధం లేని అంశంపై సిఫార్సు చేయడంలోని ఆంతర్యమేమిటి?’ అని ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఓ టీవీ చానల్ చర్చావేదికలో పాల్గొన్న ఆయన ఆకునూరి మురళి నేతృత్వంలోని విద్యా కమిషన్ నివేదికలోని పలు అంశాలపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వ్యక్తంచేశారు. ఉపాధ్యాయుల వేతనం పీఆర్సీ పరిధిలోకి వస్తుందని, ఈ అంశంపై విద్యా కమిషన్ సూచనలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి అవమానకరమేనని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ, ఉపాధ్యాయులకు చేసిందేమీలేదని ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి తెలిపారు. విద్యా కమిషన్ సైతం క్షేత్రస్థాయి పరిస్థితులకు విరుద్ధంగా నివేదిక అందజేసిందని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలోనే ఉపాధ్యాయులకు మేలు జరిగిందని తేల్చిచెప్పారు. మొదట 43 శాతం పీఆర్సీ, ఆ తర్వాత 5శాతం ఐఆర్, మ రోసారి 30శాతం పీఆర్సీ వర్తింపజేసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక వేతనాల పెంపు ఊసే ఎత్తడంలేదని విమర్శించారు.
ఐఏఎస్గా విరమణ పొందిన రామకృష్ణారావు అదే ఉద్యోగాన్ని పట్టుకొని వేలాడుతూ మరోసారి సర్వీసు పొడిగింపునకు ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని శ్రీపాల్రెడ్డి ప్రశ్నించారు. అలాంటి వారు ఉద్యోగాల్లో కొనసాగుతుండటంతోనే రాష్ట్ర ఖజానాపై భారం పడుతున్నదని, వెంటనే ఆయనను సీఎస్ బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బాధ్యయుతమైన హోదాలో ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టీచర్ల వేతనాల పెంపును తప్పుబడుతూ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
గత పన్నెండేండ్లుగా ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసిన రామకృష్ణారావు పీఆర్సీ పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ఆయనే స్వీపర్లకు రూ.2 లక్షల చొప్పున వేతనాలు ఉన్నాయని, టీచర్లు, విద్యుత్తు ఉద్యోగులకు పెద్దమొత్తంలో వేతనాలు ఇవ్వడంతోనే రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోతున్నదని పేర్కొనడం తీవ్ర అభ్యంతరమని పేర్కొన్నారు. ఫైనాన్స్ సెక్రటరీగా ఆయన తీసుకున్న అస్తవ్యస్త, అనాలోచిత నిర్ణయాలతోనే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు.