హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్లో ఎమ్మెల్సీ ఎన్నికలు చిచ్చు రేపాయి. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను అధిష్ఠానం ఖరారు చేసిందనే వార్తలతో సీనియర్లంతా ఏకమయ్యారు. అధిష్ఠానం నిర్ణయానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. చాలామంది సీనియర్ నేతలు ఉండగా జూనియర్లకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ముఖ్యంగా బల్మూరి వెంకట్కు టికెట్ ఇవ్వడాన్ని సీనియర్లంతా మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన పేరు బయటకు రాగానే సీనియర్లు గాంధీభవన్కు చేరుకున్నారు. నిన్నమొన్నటి వరకు ఎమ్మెల్సీ రేసులో అద్దంకి దయాకర్తోపాటు చిన్నారెడ్డి పేరు వినిపించింది. మంగళవారం హఠాత్తుగా బల్మూరి వెంకట్ పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్న నేతలంతా ఒక్కసారిగా నిరసనగళం విప్పారు.
బల్మూరికి వ్యతిరేకంగా సంతకాలు
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్కు అవకాశం ఇవ్వడాన్ని సమర్థిస్తున్న సీనియర్ నేతలు, బల్మూరి వెంకట్కు ఇవ్వడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన పేరు ప్రకటించినట్టు వార్తలు రాగానే గాంధీభవన్కు చేరుకున్న మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్, వేం నరేందర్రెడ్డి తదితరులు పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదస్ మున్షీతో భేటీ అయ్యారు. బల్మూరి పేరు ఖరారు చేయడంపై వారంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీ కోసం కష్టపడ్డ ఎంతోమంది సీనియర్లను కాదని, వెంకట్కు టికెట్ ఇవ్వడమేంటని ప్రశ్నించినట్టు సమాచారం.
సీనియర్ నేతలకు ఎవరికిచ్చినా తమకు అభ్యంతరం లేదని తేల్చి చెప్పినట్టు తెలిసింది. బల్మూరికి వ్యతిరేకంగా సీఎల్సీ కార్యాలయం నుంచే ఎమ్మెల్యేల సంతకాలు సేకరించినట్టు చెప్తున్నారు. ఎమ్మెల్సీ రేసులో ఉన్న మహేశ్కుమార్గౌడ్ టికెట్ల కేటాయింపుపై తీవ్రంగా స్పందించినట్టు సమాచారం. ఎన్ఎస్యూఐలో పని చేయడమే ప్రామాణికం అనుకుంటే తాను 30 ఏండ్ల కిందే అందులో పని చేశానని, అలాంటి తనను విస్మరించడం ఏంటని ప్రశ్నించినట్టు తెలిసింది. దీంతో దీపాదాస్ మున్షీ దిద్దుబాటు చర్యలకు దిగినట్టు సమాచారం. ఇక్కడి పరిస్థితిని అధిష్ఠానానికి నివేదించినట్టు తెలిసింది. మంగళవారం సాయంత్రం వరకు అధికారికంగా ఎమ్మెల్యీ అభ్యర్తుల పేర్లు ఖరారు చేస్తారనే ప్రచారం జరగ్గా.. తాజా నిరసనలతో ప్రకటన ఆలస్యమయ్యే అవకాశం ఉన్నదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
సీఎం రేవంత్పై గుస్సా
ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల ఖరారులో సీనియర్లకు ఝలక్ ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డి.. తన మార్క్ రాజకీయాన్ని నడిపించినట్టు నిపుణులు చెప్తున్నారు. తన వారిని మాత్రమే పదవుల్లో ఉండేలా చేయడంలో భాగంగానే బల్మూరికి టికెట్ ఇప్పించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో హుజురాబాద్ ఎన్నికల్లోనూ బల్మూరికి టికెట్ ఇప్పించిందే రేవంత్రెడ్డి అనే ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు మళ్లీ ఆయనే సీనియర్లను కాదని బల్మూరికి ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించారని గాంధీభవన్ వర్గాల సమాచారం. బల్మూరిని అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా పార్టీలో సీనియర్లకు చెక్ పెట్టడంతోపాటు పార్టీని తన గుప్పిట్లోకి తెచ్చుకోవచ్చని ఆయన భావిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
రేసులో సీనియర్లు
అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలా మందికి టికెట్లు ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఇస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీని పట్టించుకోకుండా వ్యవహరించడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు తమకు అవకాశం దక్కుతుందని చాలా మంది సీనియర్నేతలు భావించారు. ముఖ్యం గా నిరంజన్, కోదండరెడ్డి, మహేశ్కుమార్గౌడ్, అన్వేశ్రెడ్డి, నేరెళ్ల శారద, పటేల్ రమేశ్రెడ్డి, ఈరవత్రి అనిల్తోపాటు చాలా మంది నేతలు రేసులో ఉన్నారు. వీరందరిని కాదని బల్మూరి వెంకట్కు టికెట్ ఇవ్వడంపై సీనియర్లు మండిపడుతున్నారు. తాము పార్టీ కోసం కష్టపడలేదా? అని ప్రశ్నిస్తున్నారు.