సిద్దిపేట : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు సీఎం కేసీఆర్ ఊహించిన విధంగానే వచ్చాయని, అన్ని స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకొని ఘన విజయం సాధించిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ ఎమ్మెల్సీగా గెలిచిన యాదవరెడ్డి.. ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య, గజ్వేల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు మంగళవారం అరణ్యభవన్లో మంత్రి హరీశ్రావును కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన యాదవరెడ్డికి శుభాకాంక్షలు తెలుపడంతో పాటు అభినందించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ఎన్ని జిమిక్కులు చేసినా ఎన్ని రకాలుగా మభ్యపెట్టినా, ప్రలోభాలకు గురికాకుండా స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ వెంట నడిచారన్నారు. టీఆర్ఎస్ మెదక్ ఎమ్మెల్సీ అభ్యర్థికి 754 , అదనంగా మరో 8 ఓట్లు కలుపుకొని మొత్తం 762 ఓట్లు సాధించామన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ఏకతాటిపై నిలిచి అద్భుత విజయం సాధించేందుకు కృషి చేసిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.
వ్యవసాయం, రైతుల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్కు లేదు
ఎన్నికల వేళ కాంగ్రెస్ రైతుల పేరిట కొత్త నాటకాలకు తెరతీసిందన్నారు. వ్యవసాయం, రైతుల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్కు ఎక్కడిదని మంత్రి ప్రశ్నించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క నాడు కూడా రైతుల సంక్షేమం గురించి ఆలోచించలేదన్నారు. నాణ్యమైన ఉచిత కరెంట్, ఎరువులు, విత్తనాలు ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ రైతుల మీద మొసలి కన్నీరు కారుస్తుందని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో నీలం తుఫాన్ వస్తే సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఖమ్మం, వరంగల్కు ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదన్నారు.
అయినా, తెలంగాణ కాంగ్రెస్ నేతలు అప్పట్లో నోరు మెదపలేదని గుర్తు చేశారు. దేశంలో 24 గంటల కరెంట్ ను ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి స్పష్టం చేశారు. దీని కోసం ప్రతి ఏడాది రూ.10,500 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. రూ.14,500 కోట్లు రైతుబంధు, రూ.1,400 కోట్లు రైతుబీమా ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. రైతులకు రైతుబీమా పేరిట రూ.5లక్షలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఎన్నికల సమయంలో రైతు రుణమాఫీ అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ రాష్ట్ర రైతులకు మొండి చెయ్యి చూపించిందన్నారు.
సజావుగా ధాన్యం కొనుగోళ్లు
సజావుగా వడ్ల కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని మంత్రి హరీశ్రావు అన్నారు. అకాల వర్షంతో కొన్ని చోట్ల ధాన్యం తడిస్తే దాన్ని రాజకీయం చేయాలని కాంగ్రెస్ చూస్తుందన్నారు. సంగారెడ్డి, మెదక్లో ఇప్పటికే 95శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని, ప్రజాప్రతినిధులతో రాజకీయం చేయాలని కాంగ్రెస్ చూసిందని, కానీ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు బుద్ధి చెప్పారన్నారు. ఎంపీటీసీ, జ్పడీటీసీ వేతనాలు పెంచింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు.
మండల, జిల్లా పరిషత్లకు రూ.500కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు ఇస్తున్నామన్నారు. స్థానిక సంస్థలకు 15 ఆర్థిక సంఘం ద్వారా ఇచ్చే నిధులను బీజేపీ తగ్గిస్తే, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంతకు సమానమైన నిధులను కలిపి ఆ మొత్తాన్ని గ్రామ పంచాయతీలకు అందజేస్తున్నదని చెప్పారు. మండల, జిల్లా పరిషత్లకు రూ. 500కోట్లను ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిందన్నారు. కానీ, కేంద్రం మాత్రం అందజేసే నిధులు తగ్గించి మండల పరిషత్, జడ్పీలను బీజేపీ నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు వ్యవసాయం, దాని అనుబంధ రంగాల మీద బడ్జెట్లో అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రంలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోందన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణ 13.5 శాతం ఖర్చు చేస్తుండగా, ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్ కేవలం 4.40 శాతం, బీహార్ 3.7 శాతం, యూపీ 2.7 శాతాల చొప్పున ఖర్చు చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు వ్యవసాయం మీద ప్రభుత్వం రూ.91,520 కోట్లు ఖర్చు చేయగా, రైతులకు ఉచిత విద్యుత్ కింద రూ.44,399 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు.