హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు దమ్ముంటే ఈ నెల 5న హుజూరాబాద్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి సవాల్ విసిరారు. లేదంటే నియోజకవర్గ అభివృద్ధికి తానేమీ చేయలేదని ఒప్పుకొన్నట్టేనని స్పష్టంచేశారు. మంగళవారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈటల రాజేందర్కు నియోజకవర్గం మీద ప్రేమ ఉంటే కేంద్రం నుంచి రూ.100 కోట్లు తేవాలని డిమాండ్ చేశారు. ఈటల రూ.100 కోట్లు తెస్తే.. తాను సీఎం కేసీఆర్ను ఒప్పించి రూ.150 కోట్లు తెస్తానని చెప్పారు. నియోజకవర్గంలోని శిలాఫలకాల మీద ఈటల పేరు లేదని రుజువు చేస్తే.. అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద ముక్కునేలకు రాస్తానని, లేదంటే రాజేందర్ రాయాలని సవాల్ చేశారు. ప్రొటోకాల్లో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎమ్మెల్సీగా ఉన్న తన కంటే చిన్నవాడని పేర్కొన్నారు.
ఏముందని గజ్వేల్లో పోటీ చేస్తావ్?
హుజూరాబాద్ను అభివృద్ధి చేయలేని ఈటల రాజేందర్ గజ్వేల్లో సీఎం కేసీఆర్పై పోటీ చేస్తాననడం హాస్యాస్పదమని కౌశిక్రెడ్డి ఎద్దేవా చేశారు. గజ్వేల్కు పోయి ఏం చేస్తావని ప్రశ్నించారు. ఈటలను ఉద్దేశించి హుజురాబాద్లో యాక్టర్, హైదరాబాద్లో జోకర్, ఢిల్లీలో బ్రోకర్ అని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ ఈటలను జోకర్లా చూస్తున్నాడని చెప్పారు. చేరికల కమిటికీ బ్రోకర్లా మారాడని దుయ్యబట్టారు. టీఆర్ఎస్లో సీఎం కేసీఆర్ తరువాత గౌరవం పొందిన ఈటెలకు బీజేపీలో దక్కుతున్నదేమిటో చూస్తూనే ఉన్నామని చెప్పారు.