హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావ్ పూలే విగ్రహం ఏర్పాటు విషయంలో ఎందుకు రాజకీయ రంగు పులుముతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. భారత జాగృతి సంస్థ కోరడమే మీకు అభ్యంతరమా? లేక అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయడమే అభ్యంతరమా? అని సోమవారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. స్ఫూర్తిదాయక వీరులకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? అని నిలదీశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే జాగృతి సంస్థ ద్వారా పోరాటం చేసి అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించామని, ఇప్పుడు కూడా పూలే విగ్రహ ఏర్పాటు కోసం రాజకీయాలకు అతీతంగా మరో పోరాటం సాగిస్తామని తెలిపారు. భవిష్యత్లో రాజకీయాల కోసం, సంకుచిత మనస్తత్వంతో ఈ మహాకార్యాన్ని అవహేళన చేయరని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. పూలే మహోన్నతుడు. అణగారిన ప్రజల్లో చైతన్యం నింపిన మహా మనిషి. అందుకే ఏప్రిల్ 11 నాటికి పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని వినమ్రంగా కోరుతున్నానని ట్వీట్ చేశారు.