హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ ఉద్యోగ నియామకాల్లో మహిళా రిజర్వేషన్లకు హారిజాంటల్ (సమాంతర) విధానాన్ని అనుసరించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రిజర్వేషన్లు దక్కవని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వేల మంది మహిళలు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కవిత సోమవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఈ నెల 10న జారీచేసిన జీవో నం.3లో మహిళలకు రిజర్వేషన్లపై హారిజాంటల్ విధానాన్ని అవలంబించాలని నిర్ణయించిందని, మహిళలకు రోస్టర్ పాయింట్ లేకుండా చేశారని తెలిపారు. దీంతో తక్కువ సంఖ్యలో ఉండే ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్లు దక్కవని చెప్పారు. అర్హులైన మహిళలు లేకుంటే వాటిని కూడా పురుషులతో భర్తీ చేసే అవకాశం ఉన్నదని అన్నారు. హారిజాంటల్ విధానాన్ని గతంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం వ్యతిరేకించిందని, కోర్టును కూడా ఆశ్రయించిందని, తుది తీర్పు ఇంకా రాలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా ఆ కేసును వెనక్కి తీసుకుందని తెలిపారు. ఇదే విధానం కొనసాగితే మహిళలు 33 శాతం రిజర్వేషన్ను కొల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేస్తామని చెప్పిన రెండు లక్షల ఉద్యోగాల్లో 66వేల ఉద్యోగాలు మహిళలకు రావాల్సి ఉందని, కానీ కొత్త విధానంలో ఆ అవకాశం ఉండదని తెలిపారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హారిజాంటల్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నదని చెప్పారు. తెలంగాణలో కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోనియాగాంధీ, మల్లికార్జున్ఖర్గేకు లేఖ రాసినట్టు కవిత తెలిపారు.
సోనియా, ఖర్గేకు లేఖ: కవిత
హారిజాంటల్ విధానంపై ఎమ్మెల్సీ కవిత సోనియాగాంధీ,మల్లి ఖార్జున ఖర్గేకు లేఖ రాశారు. ఆ లేఖలో ముఖ్యంశాలు…‘1996లో అనేక పోరాటాల ఫలితంగా మహిళలకు ఉపాధి అవకాశాల్లో 33.3 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నంబరు 41, 56 జారీ అయ్యాయి. దీనికి 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఇందిరా సాహ్ని తీర్పు కూడా ఎంతో తోడ్పాటునిచ్చింది. ఆ తర్వాత రాజ్యంగబద్ధంగా మహిళలకు రోస్టర్ పాయింట్లతో కూడిన హారిజాంటల్ రిజర్వేషన్లు కల్పించారు. ఇన్నేండ్ల నుంచి సాగుతున్న ఈ పద్ధతిని ఇటీవల రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకొని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల హకులను కాలరాస్తూ జీవో 41, 56ను రద్దు చేస్తూ ఈ నెల 10న కొత్తగా జీవో 3ను తీసుకొచ్చారు. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా… మేము మహిళల హకులను హరించబోమని అంటూ 2023 జనవరిలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. కానీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 6న ఆ పిటిషన్ను ఉపసంహరించుకుంది. తద్వారా మహిళల హకులను సంపూర్ణంగా. శాశ్వతంగా హరిస్తూ రోస్టర్ పాయింట్లు లేకుండా హారిజాంటల్ పద్ధతిలో రిజర్వేషన్లను కల్పిండానికి జీవో 3ను జారీ చేసింది. రిజర్వేషన్ల స్పూర్తిని పకనబెడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త జీవో తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ విషయంలో తమరు జోక్యం చేసుకొని ఆ జీవోను తక్షణమే వెనకి తీసుకునేలా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఆదేశాలు జారీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను’ అని కోరారు.