నిజామాబాద్ : గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల( 200 units) లోపు కరెంటు(Electricity bill) వినియోగానికి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించిందని, కావున 200 యూనిట్ల లోపు వినియోగించుకున్న వారు బిల్లు కట్టవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) అన్నారు. కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారని ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ప్రకటనే కాబట్టి ప్రజలు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నిజామాబాద్ రూరల్ మండలం నర్సింగ్పల్లి గ్రామానికి చెందిన పీఏసీఎస్ మాజీ చైర్మన్, మాజీ జడ్పీటీసీ అయిత ఫిలిప్ - సుజ దంపతుల ఆహ్వానం మేరకు బుధవారం వారి నివాసంలో కవిత క్రిస్మస్ విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సంక్షమ పథకాలు అందాలంటే దరఖాస్తు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో రెండు మూడు అంశాలపై ప్రజలకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే 44 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయని, వారికి ఎటువంటి దరఖాస్తు అవసరం లేకుండా రూ.2 వేల పెన్షన్ ను రూ. 4 వేలకు పెంచే అవకాశం ఉన్నప్పటికీ పెంచకుండా మళ్లీ దరఖాస్తులు ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ గ్రామాల్లో ప్రజలు లైన్లు కట్టే పరిస్థితి ఎందుకు తీసుకోస్తున్నారని ప్రశ్నించారు. మళ్లీ దరఖాస్తులు కోరడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులకే పథకాలు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కొత్త కార్డులు జారీ చేసిన తర్వాత పథకాలను వర్తింపజేస్తే అందరికి పెద్ద ఎత్తున లాభం జరుగుతుందని అన్నారు. రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాల్లో ఇంకా ఎందుకు జమా చేయలేదన్న చర్చ గ్రామాల్లో జరుగుతోందని, దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని సూచించారు.
రూ. 4 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, దానికి ఎందుకు దరఖాస్తులు స్వీకరించడం లేదన్న చర్చ కూడా జరుగుతోందన్నారు. కాగా, ఓట్ల శాతంలో బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి పెద్ద తేడా లేదని, కేవలం 2 శాతం ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు.