MLC Kavitha | హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకంట్ల కవిత అక్రమ అరెస్టును సవాల్ చేస్తూ సోమవారం ఆమె భర్త అనిల్ సుప్రీంకోర్టులో కంటెంప్ట్ అఫిడవిట్ వేయనున్నట్టు సమాచారం. ఈ నెల 19న కవిత కేసు విచారణకు రానున్న నేపథ్యంలో ఈడీ ఆమెను అక్రమంగా అరెస్టు చేసిందని, అది సుప్రీంకోర్టు గతంలో జారీచేసిన ఉత్తర్వులకు విరుద్ధమని ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. కాగా, ఆదివారం ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారించారు. విచారణ సందర్భంగా ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చినట్టుసమాచారం.
విచారణను అధికారులు వీడియో రికార్డు చేసినట్టు తెలిసింది. విచారణ అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు, ఆమె భర్త అనిల్, న్యాయవాది మోహిత్రావు కవితను కలిశారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెప్తూనే తనపై మోపిన అభియోగాలన్నీ అభియోగాలుగానే మిగిలిపోతాయని, తాను కడిగిన ముత్యంలా బయటికొస్తానని ఆమె వారితో పేర్కొన్నట్టు సమాచారం. కాగా, సోమవారం ఎమ్మెల్సీ కవిత సమీప బంధువులు, ఆమె వ్యక్తిగత సిబ్బంది కొందరు ఆమెను కలిసే అవకాశం ఉన్నది.