మెట్పల్లి, జనవరి 20: ప్రజలు ఓట్లేసి గెలిపించింది చక్కెర ఫ్యాక్టరీలను కొనుగోలు చేయడానికి కాదని నిజామాబాద్ ఎంపీ అర్వింద్పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మీడియాతో మాట్లాడారు. నిజాం చక్కెర ఫ్యాక్టరీలను తన కు అప్పగిస్తే నడిపిస్తానని ఎంపీ అర్వింద్ అనడం విడ్డూరంగా ఉన్నదన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు ఓట్లేశారే గానీ వ్యాపారం చేసుకోవడానికి కాదనే విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. చక్కెర ఫ్యాక్టరీలను అమ్మకానికి పెడితే కాజేయాలనే ఆలోచన దారుణమన్నారు. నిజంగా రైతులపై చిత్తశుద్ధి ఉంటే ఉత్తరప్రదేశ్ సహా బీజేపీ పాలిత రాష్ర్టాల్లోని అనేక ఖాయిలాపడ్డ పరిశ్రమలను కేంద్ర ప్రభుత్వం నాబార్డు కింద రాయితీలతో పునఃప్రారంభించినట్టుగానే ఉమ్మ డి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని ముత్యంపేట, బోధన్, మెదక్ జిల్లాలోని ముంబోజిపల్లి చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించేందుకు చొరవ తీసుకోవాలని డిమాం డ్ చేశారు. 2019 ఎన్నికల్లో తనను గెలిపిస్తే వంద రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని, గిట్టుబాటు ధర కల్పిస్తానని, లేదంటే తన పదవికి రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి మూడేండ్లు గడిచిందని గుర్తుచేశారు. బోర్డు లేదు, ధర లేదంటూ ఎంపీ అర్వింద్ తీరుపై ఆయన మండిపడ్డారు. పసుపు బోర్డును మించిన స్పైస్బోర్డు తెచ్చానని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు. స్పైస్బోర్డుతో రైతులకు ఒరిగేదేమిలేదని తెలిపారు. స్పైస్బోర్డు కాదని, పసుపు బోర్డే కావాలని డిమాండ్ చేశారు. పసుపు పంటకు రూ.15 వేలు గిట్టుబాటు ధర కల్పించి రైతాంగానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు.